BJP | ఏపీ రాజకీయాల్లో సరికొత్త ట్విస్ట్! నిన్న మొన్నటి దాకా జనసేనతో కలిసి వెళ్తానని చెప్పిన బీజేపీ.. ఇప్పుడు పొత్తులపై తన వ్యూహాన్ని మార్చింది. తమకు పొత్తులు అవసరం లేదని.. పొత్తులు కోరుకునే వాళ్లే తమతో చర్చకు రావాలని సంకేతాలిచ్చింది. ఈ మేరకు బీజేపీ నేత సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.
పొత్తులను కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తుందని బీజేపీ నేత సత్యకుమార్ అన్నారు. అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా సరే దానికి అనుగుణంగానే రాష్ట్రంలోని బీజేపీ కార్యకర్తలు పనిచేస్తారని స్పష్టం చేశారు. పొత్తుల గురించి తాము స్పందించడం కాదని.. పొత్తులు కోరుకునే నాయకులు కూడా స్పందించాలని అన్నారు. ఎవరైతే పొత్తులు ఉంటాయని అనుకుంటున్నారో.. ఆ పార్టీ నాయకులు వెళ్లి మా కేంద్ర నాయకులతో పొత్తులపై చర్చించాలని సూచించారు. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయని.. అలాగే పొత్తులపై అవతలి నుంచి కూడా స్పందన రావాలి కదా అని ప్రశ్నించారు. నిజానికి సింగిల్గానే పోటీ చేయాలని అనుకున్నామని అసలు విషయం బయటపెట్టారు.
పవన్ కళ్యాణ్తో కలిసి వెళ్తామని ఇప్పటికీ చెబుతున్నామని బీజేపీ నేత సత్యకుమార్ అన్నారు. కానీ తాము ఎవరితో కలవాలని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారో.. ఆ పార్టీ నుంచి కూడా స్పందన రావాలని పునరుద్ఘాటించారు. పొత్తుల విషయాన్ని బీజేపీ పెద్దల దృష్టికి పవన్ కళ్యాణ్ తీసుకెళ్లిన మాట వాస్తవమే అని ఒప్పుకున్నారు. కానీ తమతో కలవాలని అనుకునే పార్టీతో చెప్పించాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ మీద ఉందని స్పష్టం చేశారు.