అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన చిన్నమ్మకు బీజేపీ హైకమాండ్ షాకిచ్చింది. ఆమెను పార్టీ కీలక పదవుల నుంచి తప్పించింది. ఛత్తీస్గఢ్ ఇంఛార్జీగా మరొకరికి అప్పగించింది. ఒక్కసారిగా పురందేశ్వరిని పార్టీ పదవులు, బాధ్యతల నుంచి తప్పించడంతో ఆమె అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమెను ఎందుకు అలా పక్కన పెట్టాల్సి వస్తున్నదో బీజేపీ హైకమాండ్ కూసింత కూడా చెప్పకపోవడం పట్ల బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ శాఖలో తలలో నాలుకలా మారి పార్టీ మనుగడ కోసం కృషిచేస్తున్న దగ్గుబాటి పురందేశ్వరిపై బీజేపీ నాయకత్వం చిన్నచూపు చూస్తున్నది. దీనికి నిదర్శనంగా ఆమెను పార్టీ కీలక పదవి నుంచి తప్పించింది. అదే సమయంలో ఒడిశా ఇంఛార్జీగా మరో వ్యక్తిని నియమించడంతో ఆమె వర్గీయులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. పురందేశ్వరిని ఎందుకు తప్పించాల్సి వచ్చిందో కూడా పార్టీ ఆమెకు సమాచారం ఇవ్వకపోగా.. ఒడిశా, ఛత్తీస్గఢ్ పార్టీ విభాగాల ఇంఛార్జీ పదవి నుంచి కూడా ఆమెను తప్పించారు. ఛత్తీస్గఢ్లో మోదీ, అమిత్షాకు సన్నిహితుడైన ఓం ప్రకాశ్ మాథుర్ను నియమించారు. ఛత్తీస్గఢ్లో నడ్డ పర్యటన అనంతరం ఈ మార్పు చోటుచేసుకోవడం విశేషం.
పార్టీ హైకమాండ్ అంచనాలకు తగ్గట్టుగా పురందేశ్వరి పార్టీ బలోపేతానికి కృషి చేయకపోవడమే ఈ మార్పులకు కారణమని చర్చ సర్వత్రా జరుగుతున్నది. 2020 నవంబర్ నుంచి ఆమె ఛత్తీస్గఢ్, ఒడిశా బీజేపీ వ్యవహారాల ఇంఛార్జ్గా ఉన్నారు. ఎన్టీఆర్ కుమార్తె అయిన పురందేశ్వరికి కీలక పదవులు అప్పగిస్తే ఏపీలో పార్టీలోకి చేరికలుంటాయిని బీజేపీ అధిష్ఠానం భావించింది. అయితే, వారు ఆశించినట్లుగా చేరికలు జరుగకపోవడంతో పార్టీ హైకమాండ్ నేతలు ఆమెపై బాహాటంగా అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా చర్చ నడుస్తున్నది. చేరికల కమిటీ సమావేశాన్ని నిర్వహించాలని పార్టీ పెద్దలు చెప్పినా పట్టించుకోకపోవడంతో ఆమె బాధ్యతల్లో కోత విధించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.