అమరావతి : ఏపీకి చెందిన బీజేపీ నేత వంగవీటి నరేంద్ర ( Vangaveeti Narendra ) బుధవారం వైసీపీ (YCP) లో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (CM Jagan) సమక్షంలో వైసీపీ కండువాను కప్పుకున్నారు. రాధా-రంగా మిత్ర మండలి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న వంగవీటి నరేంద్ర గత కొంతకాలంగా బీజేపీలో పనిచేస్తున్నారు. వైసీపీలో చేరిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
వంగవీటి రంగా కుటుంబానికి, వైఎస్సార్ కుటుంబానికి నాలుగు దశాబ్దాలుగా సత్సంబంధాలు ఉన్నాయని తెలిపారు. తన సోదరుడు వంగవీటి రాధా చేసిన తప్పులు చేయకుండా తాను రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న వైఎస్ జగన్ వెంట నడవడానికి వైసీపీలో చేరానని వెల్లడించారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కలయిక అనైతికమంటూ మండిపడ్డారు.
ప్రజల సంక్షేమం కోసం కూటమి ఏర్పడలేదని వారి స్వార్థం కోసమేనని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ పి.వి.మిథున్రెడ్డి, రాధా-రంగా మిత్రమండలి సభ్యులు షేక్ బాబు, ఇమ్రాన్ రజా, పి.నరేంద్ర, నాగశ్రీనివాస్ పాల్గొన్నారు.