Pawan Kalyan | భీమవరంలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. మంగళవారం నాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం జగన్తో పాటు భీమవరం ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డారు. జగన్ తాలూకూ జలగలను తీసిపారేయాలని.. భీమవరంలో ఉండే జలగలతో సహా వీధి రౌడీని ఎమ్మెల్యే చేస్తే ఏస్థాయికి వస్తుందో అర్థం చేసుకోవాలని అన్నారు. స్థానికంగా రౌడీయిజం పోవాలని ధ్వజమెత్తారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు.
పవన్ కళ్యాణ్కు తనపై ఎందుకు అంత అసూయ అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిందని గ్రంథి శ్రీనివాస్ అన్నారు. గత నెలలో భీమవరం వచ్చినప్పుడు జగన్పై, తనపై ఈర్ష్య, ద్వేషం, అసూయ లేవని పవన్ కళ్యాణ్ అన్నారని.. ఇప్పుడేమో రౌడీ, గూండా అంటూ విమర్శిస్తున్నారని అన్నారు. పవన్ కళ్యాణ్ మాటలు చూస్తుంటే ఆయన మానసిక పరిస్థితిపై అనుమానం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే పవన్ కళ్యాణ్ను మెంటల్ ఆస్పత్రిలో చేర్పించి ట్రీట్మెంట్ ఇప్పించాలని సూచించారు. నిర్లక్ష్యం చేస్తే పవన్ కళ్యాణ్ ప్రాణాలకే ప్రమాదమని.. ఒక మంచి నటుడిని కోల్పోవాల్సి వస్తుందంటూ సెటైర్ వేశారు.
పవన్ కళ్యాణ్కు ఇంటి స్థలం అమ్మే వ్యక్తులను తాను బెదిరించినట్లు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని గ్రంథి శ్రీనివాస్ స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ కావాలంటే భీమవరంలో తనకు ఉన్న 9 ఎకరాల్లో ఎంత కావాలంటే అంత ఇస్తానని స్పష్టం చేశారు. చంద్రబాబు మోచేతి నీళ్లు తాగి.. కేవలం 24 సీట్లకే పరిమితమయ్యాడని.. ఇప్పుడు 21 సీట్లు మాత్రమే అంటున్నారని అన్నారు. జనసైనికుల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు కాళ్ల దగ్గర పవన్ కళ్యాణ్ తాకట్టు పెట్టాడని విమర్శించారు.
రాజకీయాల కోసం సొంత అన్నయ్యతోనే విభేదించానని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపైనా గ్రంథి శ్రీనివాస్ మండిపడ్డారు. చిరంజీవి ఎన్నికల్లో పోటీ చేస్తే 80 లక్షల ఓట్లు వచ్చాయని.. 18 సీట్లు గెలిచాడని తెలిపారు. సౌమ్యుడు, వివాదరహితుడైన చిరంజీవితో అసలు నీకేంటి పోలిక అని ధ్వజమెత్తారు. పవన్లా సంస్కారం లేక విమర్శలు చేయలేక రాజకీయాల నుంచి వెళ్లిపోయారని స్పష్టం చేశారు. కానీ 2019లో ఓటమి తర్వాత పవన్ మళ్లీ భీమవరం వైపు చూడలేదని విమర్శించారు. మరో సొంత అన్న నాగబాబుకు కూడా పవన్ కళ్యాణ్ అన్యాయం చేశారని వఆరోపించారు.