Sai Tejaswi | ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా మైనంపాడు గ్రామవాసి, భరత నాట్య కళాకారిణి గుడిదేని సాయి తేజస్వి అరంగ్రేటం ఘనంగా సాగింది. సింగపూర్ నేషనల్ యూనివర్సిటీ సాంస్కృతిక కేంద్రంలో ఈ నెల 13న ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ తెలుగు తేజం ప్రదర్శించిన నృత్యం అద్యంతం బహురమణీయంగా సాగింది.
ప్రాచీన కళలకు ప్రోత్సాహం కరువైన ప్రస్తుత తరుణంలో సాయి తేజస్వి తన నాట్యకౌశలంతో ఆహుతులను అలరించారు. ఐదేండ్ల వయస్సులో అభ్యాసం ప్రారంభించిన సాయి తేజస్వి ఇప్పుడు అరంగ్రేటం పూర్తయింది.సాయి తేజస్వి చెల్లెలు ఖ్యాతిశ్రీ ఆలపించిన గణేశ ప్రార్ధనాగీతంతో కార్యక్రమం మొదలైంది.
విష్ణు ఆవాహనంతో మొదలైన నృత్యప్రదర్శన.. వర్ణం, పదం, అభంగ్, జావళి, థిల్లాన తదితర అంశాలతో అత్యంత ఆకర్షణీయంగా, కనులవిందుగా సాగింది. తన హావభావాలతో, నాట్య భంగిమలతో సాయి తేజస్వి మూడు గంటలపాటు ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేశారు. గురువు శ్రీలిజీ శ్రీధరన్ నృత్యాలకు సుందరంగా రూపకల్పన చేశారు.
ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన కూచిపూడి గురువు, పద్మశ్రీ అవార్డు గ్రహీత పద్మజారెడ్డి.. చిన్నారి నృత్య ప్రదర్శనను ప్రశంసించారు. ప్రత్యేక అతిధులుగా సింగపూర్ ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ కోశాధికారి వెంకట్ పద్మనాధన్, కళాక్షేత్ర గురువు సీతారాజన్, ఆత్మీయ అతిధులుగా విదూషి డాక్టర్ ఎమ్.ఎస్. శ్రీలక్ష్మి, శ్రీ సాంస్కృతిక కళాసారధి అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్, సామాజిక కార్యకర్త సునీతా రెడ్డి తదితరులు హాజరై సాయి తేజస్విని దీవించారు.
సాయి తేజస్వి తల్లిదండ్రులు గుడిదేని వీరభద్రయ్య, పావని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆమె నానమ్మ గుడిదేని గోవిందమ్మ కూడా హాజరై సాయి తేజస్వికి ఆశీస్సులు అందించారు. ఈ కార్యక్రమానికి 500 మందికి పైగా ఆహుతులు హాజరయ్యారు.
సాయి తేజస్వి ఎనిమిది ఏండ్ల వయస్సులోనే పలు అంతర్జాతీయ నృత్య కార్యక్రమాలలో విజేతగా అవార్డులు పొందారు. 2019 లో త్యాగయ్య టీవీ నిర్వహించిన కార్యక్రమంలో నాట్యశిరోమణి బిరుదు అందుకున్నారు.