తిరుమల : టీటీడీ ఆధ్వర్యంలో ముద్రించిన భగవద్గీత పుస్తకాలు, క్యాలెండర్లను టీటీడీ చైర్మన్ (TTD Chairman) భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఎవి.ధర్మారెడ్డితో మంగళవారం ఆవిష్కరించారు. తిరుమల అన్నమయ్య భవనంలో మంగళవారం టీటీడీ బోర్డు మీటింగ్ అనంతరం వీటిని ఆవిష్కరించారు. సనాతన ధర్మం, మానవీయ, నైతిక విలువలను విద్యార్థులలో అవగాహన కల్పించేందుకు సులభంగా అర్ధమయ్యేలా 20 పేజీలతో కూడిన భగవద్గీతను లక్ష పుస్తకాలను టీటీడీ (TTD) ముద్రించిందని చైర్మన్ తెలిపారు.
టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో తెలుగు, ఇంగ్లిష్, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో 20 వేల పుస్తకాల వంతున ముద్రించిన భగవద్గీతను ఆయా రాష్ట్రాల్లో విద్యార్థులకు ఉచితంగా అందివ్వనున్నట్లు్ వెల్లడించారు. టీటీడీ స్థానిక ఆలయాలైన అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి, నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి, నాగలాపురం శ్రీ వేద నారాయణస్వామి, కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామి, ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి మూలమూర్తులు, ఉత్సవమూర్తులతో కూడిన 13 వేల క్యాలెండర్లను టీటీడీ మొదటి సారిగా ముద్రించిందని పేర్కొన్నారు.
ఇందులో మూలమూర్తితో కూడిన క్యాలెండర్లు రూ.20, ఉత్సవర్ల క్యాలెండర్ రూ.15 లతో టీటీడీ భక్తులకు అందుబాటులో ఉంచిందని ఆయన వివరించారు. యువతలో హైందవ సనాతన ధర్మ వ్యాప్తి కోసం 25 ఏళ్ల లోపు వారికి రామ కోటి తరహాలో గోవింద కోటి పుస్తకాలను అందుబాటులో ఉంచామని ఆయన అన్నారు.