అమరావతి: పదో తరగతి విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం ఊరటనిచ్చే వార్త చెప్పింది. ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థుల కోసం బెటర్మెంట్ ఎగ్జామ్స్ నిర్వహించేందుకు ఏపీ సర్కార్ సిద్ధమైంది. ఇప్పటివరకు ఇంటర్మీడియట్ విద్యార్థులకు మాత్రమే ఈ బెటర్మెంట్ పరీక్షలు నిర్వహించే వారు. కాగా, రెండేండ్లుగా కొవిడ్ కారణంగా ఉత్తీర్ణతాశాతం తగ్గడంతో పదో తరగతి విద్యార్థులకు అవకాశం కల్పించాలని భావించిన ప్రభుత్వం.. ఈ మేరకు బెటర్మెంట్ పరీక్షల నిర్వహణకు నిర్ణయం తీసుకున్నది.
ఈ పరీక్షలకు ఏప్రిల్ 2022 ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన, ఒక సబ్జెక్ట్లో 50 కంటే తక్కువ (49 అంతకంటే తక్కువ) మార్కులు సాధించిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. గరిష్టంగా రెండు సబ్జెక్టులకు బెటర్మెంట్ పరీక్షలకు హాజరు కావడానికి అర్హులని ఏపీ విద్యాశాఖ డైరెక్టరేట్ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఒక సబ్జెక్ట్ కోసం దరఖాస్తు రుసుం కింద రూ. 500 చెల్లించాలి. రెండు సబ్జెక్టుల కోసం రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. బెటర్మెంట్ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే విద్యార్థులు తాము చదివిన పాఠశాల హెడ్ మాస్టర్ను సంప్రదించి తమ దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది.
2022 జూలై 6 నుంచి 2022 జూలై 15 వరకు ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఎస్ఎస్సీ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలతో పాటు ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ఇలాఉండగా, ఏపీలో 10వ తరగతి ఉత్తీర్ణత శాతం 2019లో 94.88 శాతంగా నమోదైంది. కాగా, 2022లో గణనీయంగా 67.26 శాతానికి పడిపోయింది. పరీక్షలకు హాజరైన 6,15,908 మందిలో మొత్తం 4,14,281 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.