అమరావతి : నూతన సంవత్సర వేడుకల నిర్వహణపై ఆంక్షలు విదిస్తున్న ఏపీ ప్రభుత్వం మద్యం విక్రయాలపై ఆంక్షలను సడలిస్తుంది. ఈ రోజు రాత్రి రాష్ట్రంలోని బారు, రిటైల్ మద్యం దుకాణాల్లో విక్రయాల సమయాన్ని మరో గంట పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రోజు అర్ధరాత్రి వరకు మద్యం విక్రయాలకు అనుమతిస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఆదేశాలు జారీ చేశారు. ఈవెంట్స్తో పాటు పర్యాటక లైసెన్సులు కలిగిన హోటళ్లలో విక్రయానికి అనుమతిని పొడిగించడం విశేషం.
మరో వైపు గుంటూరులో పోలీస్ యాక్ట్ 30ని అమలు చేస్తున్నారు. రోడ్లపైకి రావద్దని సంబంధిత ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. విశాఖ జిల్లాలో ఈరోజు రాత్రి 8 గంటల నుంచి బీచ్లు మూసివేస్తున్నట్లు ట్రాఫిక్ ఏడీసీపీ ఆదినారాయణ తెలిపారు. బహిరంగ ప్రదేశాలు, పార్కులు, రహదారులపై వేడుకలు నిషేదించినట్లు ఆయన పేర్కొన్నారు. విజయవాడలో రాత్రి 12 గంటల వరకే ఇండోర్ వేడుకల కు అనుమతి ఇస్తామని , వేడుకలల్లో సామర్థ్యానికి మించి ఎక్కువ మందికి అనుమతి లేదని విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాణా టాటా వెల్లడించారు. అర్దరాత్రి రోడ్లపై ఎవరూ తిరగకూడదని హెచ్చరించారు. బందరు, ఏలూరు, బీఆర్టీస్ రోడ్లు, పై వంతెనలు మూసివేస్తున్నామని వివరించారు.