Balineni Srinivas Reddy | తానెప్పుడూ మంత్రి పదవి కోసం పాకులాడలేదని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని ప్రభుత్వం కొత్త క్యాబినెట్ కొలువు దీరింది. పాత మంత్రుల్లో కొందరికి రెండోసారి చాన్స్ లభించింది. కానీ సీఎం వైఎస్ జగన్కు అత్యంత సన్నిహితుడు.. బాలినేని శ్రీనివాస్ రెడ్డికి బదులు ఆదిమూలపు సురేశ్కు క్యాబినెట్లో చోటు దక్కింది. దీంతో బాలినేని అలకపాన్పు ఎక్కారు. ఏపీ సర్కార్ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి రెండు దఫాలు బాలినేని ఇంటికెళ్లి బుజ్జగించేందుకు ప్రయత్నించినా ససేమిరా అన్నారు.
సోమవారం క్యాబినెట్ కొలువు దీరిన తర్వాత బాలినేని నేరుగా తాడేపల్లిలోని సీఎం వైఎస్ జగన్ క్యాంప్ ఆఫీసుకు చేరుకున్నారు. వైఎస్ జగన్తో దాదాపు గంటన్నర సేపటికి పైగా చర్చలు జరిపారు. క్యాంప్ ఆఫీసులో సీఎం వైఎస్ జగన్తో చర్చల తర్వాత బయటకు వచ్చిన బాలినేని మీడియాతో మాట్లాడారు.
గతంలో వైఎస్ జగన్మోహన రెడ్డి.. సొంతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో నాలుగేండ్ల పాటు మంత్రిగా కొనసాగే అవకాశాన్ని వదులుకుని వచ్చిన వాడినన్నారు. అటువంటి తాను మంత్రి పదవి కోసం అర్రులు చాచాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. 2019లోనే రెండున్నరేండ్ల తర్వాత 25 మంది మంత్రులను తొలగిస్తానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి చెప్పినప్పుడు కూడా ముందే తాను స్పందించానని బాలినేని గుర్తు చేశారు. రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉండాలని ఇతరులకు చెప్పానన్నారు. ఎవరికైనా మంత్రి పదవి కోల్పోయినప్పుడు ప్రారంభంలో కొంత ఫీల్ (బాధ) ఉంటది అని అన్నారు.
మంత్రి పదవి పోతే పార్టీకి రాజీనామా చేస్తానని అన్నట్లు ఒక పత్రికలో వార్త వచ్చిందని, అదే రోజు తాను ఖండించానని బాలినేని చెప్పారు. మంత్రి పదవి కోసం రకరకాల వార్తలు రాయడం కరెక్ట్ కాదన్నారు. మళ్లీ తాను రాజీనామా చేస్తానని వార్తలు రాస్తే పరువునష్టం దావా వేస్తామని అప్పుడే చెప్పాం అన్నారు. ఎప్పుడైనా మంత్రి పదవి కేటాయింపు సీఎంగారి ఆలోచన ప్రకారమే జరుగుతుందని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని వచ్చిన వార్తలు ఊహాగానాలేనన్నారు.
తానెప్పుడూ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి, వైఎస్ జగన్మోహన రెడ్డికి విధేయులం అని బాలినేని అన్నారు. సురేశ్కు క్యాబినెట్ ఇస్తే వాసు అలిగాడని వార్తలొచ్చాయి. మంత్రులుగా తామిద్దరం కలిసి పని చేశామని, తమ మధ్య సఖ్యత ఉందని తేల్చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి తనకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తామన్నారని బాలినేని చెప్పారు.
సీఎం జగన్ అప్పగించే బాధ్యతలు నిర్వర్తించడం ద్వారా తమ జిల్లాలో గతంలోకంటే ఎక్కువ సీట్లలో పార్టీని గెలిపించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయబోమన్నారు. మంత్రి ఆదిమూలం సురేశ్తో తనకు ఎటువంటి విబేధాల్లేవని చెప్పారు. అన్ని సామాజిక వర్గాలకు మేలు, న్యాయం చేసే పార్టీ వైసీపీనే అని అన్నారు. సీఎం జగన్తో బాలినేని చర్చల్లో సజ్జల రామకృష్ణారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి ఉన్నారు.
తనను క్యాబినెట్ నుంచి తప్పించడంపై బాలినేని శ్రీనివాసరెడ్డి అగ్గిమీద గుగ్గిలమైనట్లు వార్తలొచ్చాయి. ఆయన్ను బుజ్జగించేందుకు సీఎం వైఎస్ జగన్ ప్రతినిధిగా సజ్జల రామకృష్ణారెడ్డి రెండుసార్లు బాలినేని ఇంటికెళ్లారు. కానీ బాలినేని మాత్రం కాసింత దూకుడుగానే ఉన్నారు. తన రాజీనామాపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం.