తిరుపతి జిల్లా : శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ సదస్సు జరిగింది. యూనివర్సిటీ ఉపకులపతి, టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి ఆదేశాల మేరకు కులసచివులు డాక్టర్ ఏవీ రాధేశ్యామ్ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ సుబ్రహ్మణ్యంబిడే, డాక్టర్ రాజేష్ కుమార్, డాక్టర్ నీలకంఠం, గంజాం రామకృష్ణ, డాక్టర్ కే పురుషోత్తమాచార్యులు, డాక్టర్ ప్రవా రామకృష్ణ సోమయాజి తదితరులు వివిధ అంశాలపై ఉపన్యసించారు.
ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం సాహిత్య విభాగం ఆచార్యులు డాక్టర్ చక్రవర్తి రంగనాథ్ ఆర్ష వాంజ్ఞయంలో రాష్ట్ర భావన అనే అంశంపై ఉపన్యసించారు. జాతీయ నాయకులైన మహాత్మాగాంధీ, పండిట్ జవహర్ లాల్ నెహ్రూ వంటి వారు శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకుని పాలన అందించారని తెలిపారు. అలాంటి నాయకులను అమృతోత్సవాల సమయంలో స్మరించుకోవడం మన ధర్మమని చెప్పారు. స్వామి వివేకానంద వంటి మహనీయులు వేదాలను ఆధారంగా తీసుకొని దేశ ప్రతిష్టను ఇనుమడించేలా ప్రసంగాలు చేశారని, వారి మార్గంలో నేటి యువత నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అకడమిక్ డీన్ డాక్టర్ ఫణియజ్ఞేశ్వరయాజులు, పీఆర్వో డాక్టర్ టీ బ్రహ్మాచార్యులు తదితర అధ్యాపకులు పాల్గొన్నారు.