అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. 16వ శాసనసభాపతిగా సీనియర్ ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు (Ayyannapatrudu) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికను ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి అధికారికంగా ప్రకటించారు. అనంతరం ఆయనను సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సభాపతి స్థానంలో కూర్చోబెట్టారు. తొలిరోజు సమావేశాల్లో భాగంగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణం స్వీకారం చేశారు. అనంతరం స్పీకర్ ఎన్నికకు నామినేషన్ ప్రక్రియ ప్రారంభించారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు నామినేషన్లు ముగిశాయి. ఒకే నామిషన్ దాఖలవడంతో అయ్యన్నపాత్రుడి ఎన్నిక ఏకగ్రీవమైంది.
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా అయ్యన్నపాత్రుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1983లో టీడీపీ ఆవిర్భావం అనంతరం ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఒకసారి ఎంపీగా పనిచేశారు. పదిసార్లు నర్సీపట్నం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసిన ఆయన ఏడుసార్లు గెలుపొందారు. ఇప్పటివరకు ఐదు ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేశారు.