TTD News | తిరుపతిలోని దీపావళి పర్వదినం విశేష కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ముందుగా టీటీడీ పరిపాలనా భవనం ఎదురుగా ఉన్న టీటీడీ ముద్రణాలయంలో ఆయుధపూజ ఘనంగా జరిగింది. తిరుమల ఆలయ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఏవీ ధర్మారెడ్డి నేతృత్వంలో ఈ ఆయుధపూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీవారి విగ్రహానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ముద్రణాలయాన్ని అందంగా అలంకరించి అర్చకులు వేదమంత్రాలు పఠిస్తూ అక్కడి యంత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. డీటీపీ, ఆఫ్సెట్, మిషన్ సెక్షన్, ఆర్టిస్టు, బైండింగ్ విభాగాల్లోని యంత్రాలకు పూజలు చేశారు. దీపావళి సందర్భంగా ఆయుధపూజ నిర్వహించడం అనాదిగా ఆచారంగా వస్తున్నది. ఈ కార్యక్రమంలో జేఈఓలు శ్రీమతి సదా భార్గవి, వీరబ్రహ్మం, డీఎల్ఓ రెడ్డప్పరెడ్డి, పీఆర్ఓ డాక్టర్ టీ రవి, ముద్రణాలయం ప్రత్యేకాధికారి రామరాజు, రవాణా విభాగం జీఎం శేషారెడ్డి, డీఈఓ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.