TTD News | తిరుమలలో ఉద్యానవనాలకు పూర్వ వైభవం తీసుకురావాలని టీటీడీ సిబ్బందిని ముఖ్య కార్యనిర్వహణాధికారి ఏవీ ధర్మారెడ్డి సూచించారు. తిరుమలకు వచ్చే భక్తులకు ఆహ్లాదకరంగా ఉండేలా ఉద్యానవనాలను తీర్చిదిద్దాలన్నారు. దాతల సహకారంతో జీఎన్సి టోల్ గేట్ వద్ద గల గీతోపదేశం పార్కు, జీఎన్సి నుంచి బస్టాండ్ వరకు రోడ్డుకు కుడి వైపున గల పార్కు, శంఖుమిట్ట వద్ద ఉన్న నామాల పార్కు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1 లోపల, శ్రీ పద్మావతి విశ్రాంతి గృహం వద్ద రంగురంగుల పుష్పాలు, పచ్చని మొక్కలతో చక్కగా పార్కులను అభివృద్ధి చేసినట్లు ఆయన తెలిపారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో సీనియర్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
నారాయణగిరిలో రెండు నెలల్లో ఉద్యానవనాలను పూర్తిగా అభివృద్ధి చేయాలని ఆయన అధికారులకు సూచించారు. తిరుమల అటవీ ప్రాంతంలో అకేషియా చెట్ల స్థానంలో సాంప్రదాయ మొక్కలు పెంచాలని, ఔటర్ రింగ్ రోడ్డులో ఆహ్లాదకరంగా మొక్కల పెంపకం చేపట్టాలని కోరారు. విభాగాల వారీగా ఎన్నో ఏండ్లుగా లక్షలాదిగా ఉన్న ఫైళ్లు, ఇతర రికార్డులను ప్రత్యేక సాఫ్ట్ వేర్ ద్వారా డిజిటైజ్ చేసి భద్రపరచాలని ఆదేశించారు. తిరుమలలోని ఎస్వీ మ్యూజియం అభివృద్ధికి సంబంధించి టాటా సంస్థ ముందుకు వచ్చిందని, అక్కడ పెండింగ్లో ఉన్న పనులను వేగవంతం చేయాలన్నారు.
తిరుమల నూతన పరకామణి భవనానికి అవసరమైన యంత్రాలను మరో నెలలోపు సమకూర్చుకోవాలని ఏవీ ధర్మారెడ్డి అధికారులకు సూచించారు. టీటీడీపై వస్తున్న కేసులను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు వీలుగా తగిన చర్యలు చేపట్టాలని న్యాయ విభాగం అధికారులను కోరారు. పాలనలో మరింత సమర్థత పెంచేందుకు వీలుగా నూతన మార్పులకు శ్రీకారం చుట్టాలని, తద్వారా రోజువారీ పాలన వ్యవహారాల పర్యవేక్షణకు, భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు వీలవుతుందని చెప్పారు. అనంతరం పే అండ్ అకౌంట్స్, విద్య విభాగాలకు సంబంధించిన ప్రగతిని పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఈఓ పరిశీలించారు. ఈ సమావేశంలో టీటీడీ జేఈఓలు శ్రీమతి సదా భార్గవి, వీరబ్రహ్మం, సీవీఎస్ఓ నరసింహ కిషోర్, ఎస్వీబీసీ సీఈఓ షణ్ముఖ్ కుమార్, ఎఫ్ఏసీఏఓ బాలాజి, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు తదితర అధికారులు పాల్గొన్నారు.