అమరావతి: సినిమా టిక్కెట్ల పెంపు ఉత్తర్వుల జారీలో సినిమా పెద్దలు వ్యవహరించిన తీరుపై జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. సీఎం జగన్కు సన్మానం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తున్నదని దుయ్యబట్టారు. ఏం సాధించారని సీఎంకు సన్మానం చేస్తారని ప్రశ్నించారు. తెలుగు సినిమా పెద్దలు ఇకనైనా తమ వైఖరిని మార్చుకోవాలని నాదెండ్ల మనోహర్ సూచించారు.
వినోదాన్ని పేదలకు అందుబాటులోకి తెస్తానన్న వైసీపీ ప్రభుత్వం.. ఇప్పుడు సినిమా టికెట్ల రేట్లు పెంచిందని, దీనికేం సమాధానం చెప్తారని సినీ పెద్దలను ప్రశ్నించారు. రాత్రికి రాత్రే పేదలు ధనవంతులయ్యారా? అంటూ ప్రభుత్వాన్ని నిలదీసిన ఆయన.. ప్రజలను ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం తీరును తప్పుపడుతూ ప్రజలకు సినీ ఇండస్ట్రీ అండగా నిలబడాలన్నారు. తమ విషయంలోనే ప్రభుత్వం ఇలా వ్యవహరించిందంటే.. సామాన్యుల పరిస్థితి ఏంటి? అనేది సినిమా ఇండస్ట్రీ పెద్దలు ఆలోచించాలని సూచించారు.
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా ప్రేక్షకుల ముందుకు ఇటీవలే వచ్చింది. ఈ సినిమా విడుదలై వారం రోజులు గడిచిన తర్వాత ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా జీవో జారీ చేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా, జనసేన ఆవిర్భావ సభ ఏర్పాట్లపై కసరత్తు చేస్తున్న నాదెండ్ల మనోహర్.. నిర్వాహణ కమిటీలతో సమావేశమయ్యారు. సభకు వచ్చే వారికి రవాణా, పార్కింగ్ ఏర్పాట్లపై దృష్టి పెట్టాలని పార్టీ శ్రేణులకు సూచించారు. మహిళలకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.