Vellampalli Srinivas | ఏపీ సీఎం వైఎస్ జగన్ను హత్య చేసేందుకు టీడీపీ నేతలు కుట్రలు పన్నారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలతోనే బోండా ఉమ రాయితో దాడి చేయించారని విమర్శించారు. తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో శనివారం వెల్లంపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. జగన్పై దాడిని టీడీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
జగన్పై దాడి ఘటనలో పక్కనే ఉన్న తనకు కూడా గాయమైందని వెల్లంపల్లి తెలిపారు. అయితే ఈ ఘటనపై టీడీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కంట్లో నలుసుపడితేనే అల్లాడిపోతాం.. అలాంటి సున్నితమైన ప్రాంతంలో ఎవరైనా కావాలని గాయం చేసుకుంటారా అని ప్రశ్నించారు. రాయి దాడితో జగన్, తాను ఇబ్బంది పడుతుంటే టీడీపీ నేతలు వ్యంగ్యంగా మాట్లాడటం ఎంతవరకు సబబు అని అడిగారు. రాయి దాడిలో టీడీపీ నేతల హస్తం ఉందని వారి మాటలతోనే అర్థం అవుతుందని చెప్పారు.
అన్నా క్యాంటీన్ మూసివేసినందుకే వేముల సతీశ్ రాయితో కొట్టాడని బోండా ఉమ చేసిన కామెంట్లకు సంబంధించిన వీడియోను ఈ సందర్భంగా వెల్లంపల్లి మీడియాకు చూపించారు. ఈ విషయం బోండా ఉమకు ముందే ఎలా తెలిసిందని ప్రశ్నించారు. అంటే.. బోండా ఉమకి, వేముల సతీశ్కు పరిచయం ఉండాలి.. లేదంటే.. అదే సతీశ్ను దాడి చేసేలా ప్రేరేపించి ఉండాలని అనుమానం వ్యక్తం చేశారు. బోండా ఉమ పచ్చి తాగుబోతు అని.. తాగేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. సీపీని కూడా బెదిరిస్తున్నాడని.. అధికారులతో వ్యవహరించే తీరు ఇదేనా అని ప్రశ్నించారు. జూన్ 4 తర్వాత మీ సంగతి చూస్తానని బెదిరిస్తున్నాడని తెలిపారు. సాక్ష్యాధారాలను తారుమారు చేస్తూ బోండా ఉమ బెదిరిస్తున్నాడని.. ఈ అంశాన్ని సుమోటోగా తీసుకోవాలని ఎన్నికల కమిషన్ను విజ్ఞప్తి చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు.