అమరావతి: అంకుర సంస్థల ఏర్పాటుకు ఔత్సాహిక పారిశామ్రిక వేత్తలు ముందుకు వస్తే సహకారం అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని డీఆర్డీవో చైర్మన్ సతీశ్రెడ్డి తెలిపారు. విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కళాశాలలో ‘ఆజాదీ అమృత్ మహోత్సవ్’లో భాగంగా ఇస్రో, డీఆర్డీవో, ఎన్ఐటీలు ఏర్పాటు చేసిన ప్రదర్శనలో పాల్గొన్నారు. ‘రక్షణ పరిశోధన- అభివృద్ధి సంస్థ, విజ్ఞాన్ ప్రసార్ ’ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వైజ్ఞానిక ప్రదర్శనను సందర్శించారు.
అనంతరం విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో యువత మరిన్ని పరిశోధనలు చేసి దేశాన్ని అగ్రగామిగా నిలపాలని సూచించారు. 2047 నాటికి అన్ని రంగాల్లోనూ ప్రపంచంలోనే భారత్ను అగ్రగామిగా నిలపాలని ప్రధాని మోదీ దిశానిర్దేశం చేశారని పేర్కొన్నారు . దేశంలో ప్రతిభావంతులైన యువత పారిశ్రామికవేత్తలుగా మారేందుకు ఆసక్తి చూపుతున్నారని, ఇందుకు 60 వేల స్టార్టప్లు ప్రారంభం కావడమే ఉదాహరణ అని వివరించారు.
ప్రపంచంలో అత్యున్నత ప్రమాణాలతో అర్జున్ ట్యాంక్ను తయారుచేశామని అన్నారు. రోదసీ రంగంలో అమెరికా, చైనా, రష్యాలతో ఇస్రో పోటీ పడుతోందన్నారు. ప్లాస్టిక్ను నిర్మూలించి, పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్దేశ్యంతో ప్లాస్టిక్ బ్యాగ్ల స్థానంలో పర్యావరణ హితమైన బయోడిగ్రేడబుల్ బ్యాగ్లను డీఆర్డీవో రూపొందించిందని గుర్తు చేశారు.