తుపాను అసని ఒక్క సారిగా తన దిశను మార్చుకుంది. ఉత్తర కోస్తాతో పాటు ఒడిశా మధ్యలో తీరం దాటుతుందనుకున్న తుపాను.. మచిలీపట్నం వైపు దూసుకొస్తోందని వాతావరణ శాఖ పేర్కొంది. రేపటి సాయంత్రానికి మచిలీపట్నానికి సమీపంలో తీరం దాటే సూచనలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. ఈ తుపాను ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం కాకినాడకు 220 కిలోమీటర్ల దూరంలో ఈ అసని తుపాను ఉంది.
ఇక కోస్తాంధ్రలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. మత్స్య కారులు ఎవ్వరు కూడా బయటికి వెళ్లొద్దని అధికారులు సూచించారు. అంతేకాకుండా ఉమ్మడి కృష్ణ, గుంటూరు జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు పడుతున్నాయి.
ఇక… అసని తుపాను కారణంగా విశాఖలో అతి భారీ వర్షం కురుస్తోంది. నగర ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. బీచ్ రోడ్డుపైకి భారీగా వర్షపు నీరు చేరింది.