Nagababu | భారీ వరదలకు విజయవాడ మునిగిపోవడానికి మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ కారణమని వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన కామెంట్లపై జనసేన నాయకుడు, మెగా బ్రదర్ నాగబాబు మండిపడ్డారు. సీఎం చంద్రబాబు సర్కార్ ఘోర తప్పిదం వల్లనే విజయవాడ విలవిల్లాడుతోందన్న జగన్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విమర్శలే కాదు విపత్తు సమయంలో వీలైనంత సాయం కూడా చేస్తే బాగుంటుందని హితవు పలికారు. 2021లో అన్నమయ్య ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయిన ఘటనలో వైసీపీ ప్రభుత్వ తప్పిదాలను వివరించారు.
మూడేళ్ల క్రితం అన్నమయ్య ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయిన ఘటనలో 44 మంది మృత్యువాత పడ్డారని.. 15 మంది ఆచూకీ గల్లంతయ్యిందని నాగబాబు గుర్తుచేశారు. ఈ ఘటనలో ఐదు ఊర్లు పూర్తిగా నేలమట్టమయ్యాయని.. వందలాది పశువులు చనిపోయాయని తెలిపారు. ఎటు చూసినా కూలిన ఇళ్లు.. ఇంకా గూడారాల మధ్యనే అనేక మంది నివాసం ఉండటం ఇప్పటికీ కనిపిస్తుందన్నారు. చెయ్యేరులో పెద్ద ఎత్తున ఇసుక తవ్వుతారని.. అందుకోసం నదిలో లారీలు దిగుతాయని.. డ్యాం గేట్లు ఎత్తితే అవి వరదలో చిక్కుకుపోతాయి కాబట్టి, వాటిని పైకి తరలించే వరకూ డ్యాం గేట్లు ఎత్తనివ్వకుండా ఆపాడం వల్లే ఈ ఘటన జరిగిందని ప్రధాన ఆరోపణ ఉందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టుల నిర్వహణ లోపం వల్లే అన్నమయ్య ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయిందని నాగబాబు అన్నారు. ఈ ఘటన దేశంలోనే ఒక కేస్ స్టడీ అని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్షెకావత్ పార్లమెంటులో అన్నారని తెలిపారు. దీన్ని అంటారు సార్ మ్యాన్ మేడ్ డిజాస్టర్ ( Man Made Disaster ) అని విమర్శించారు. మీరు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కాబట్టి సహజ విపత్తుల ( )కు మానవ తప్పిదాల( Man made Disaster )కు తేడా తెలుసుకోవాల్సింది కోరుతున్నానని ఎద్దేవా చేశారు.
మీ ప్రభుత్వం సకాలంలో డ్యామ్ గేటు రిపేర్ చేయకపోవడం వల్ల, మీ బృందం మితిమీరి అక్రమంగా ఇసుక రవాణా చేయడం వల్ల అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోవడాన్ని Man made Disaster అని అంటారని గమనించాలని సూచించారు. వీలైతే ముంపు ప్రాంతాల్ని పర్యటించి, వరదల ద్వారా ఆస్తులు నష్టపోయిన బాధితుల్ని ఆర్థికంగా ఆదుకుంటే బాగుంటుందని అన్నారు. విమర్శలే కాదు విపత్తు సమయంలో వీలైనంత సాయం కూడా చేస్తే బాగుంటుందని విన్నవించారు.