కోనసీమ జిల్లా: అమలాపురం అల్లర్ల కేసులో నిందితుల అరెస్టులు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేసిన అల్లరిమూకలను పోలీసులు గుర్తిస్తున్నారు. వీడియో, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటి వరకు 143 మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. వీరిలో అత్యధికులు జనసేన, టీడీపీకి చెందిన వారు ఉన్నట్లుగా తెలుస్తున్నది.
కోనసీమ జిల్లా పేరును బీఆర్ అంబేడ్కర్ జిల్లాగా మార్చాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ అమలాపురం పట్టణానికి చెందిన ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల దిగ్బంధంతోపాటు పోలీస్ స్టేషన్ ముట్టడి నిర్వహించారు. పలు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వసం చేశారు. ఈ సందర్బంగా మంత్రి పినిపె విశ్వరూప్తోపాటు మరో అధికార పార్టీ ఎమ్మెల్యే ఇండ్లను నిరసనకారులు దహనం చేశారు. అల్లర్లకు పాల్పడిన వారిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఇప్పటి వరక 143 మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు పోలీసు వర్గాల ద్వారా తెలిసింది. వీరిలో జనసేనకు చెందిన 62 మంది, టీడీపీకి చెందిన 21 మంది కార్యకర్తలు ఉన్నారు. అరెస్టయిన వారిలో ఐదుగురు చొప్పున బీజేపీ, వైఎసీపీ వారు కూడా ఉన్నారు. మిగిలిన 50 మంది ఏ పార్టీకి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. దాడులకు పాల్పడినట్లు భావిస్తున్న వైసీపీ సభ్యులను కూడా పోలీసులు అరెస్టు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నది.
జిల్లా పేరును బీఆర్ అంబేద్కర్గా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించడంపై కోనసీమ ప్రజలు పెద్దఎత్తున ఆందోళనలకు పిలుపునిచ్చారు. వందల సంఖ్యలో జనం తరలిరావడంతో పరిస్థితి అదుపు తప్పింది. యువకులు, ఆందోళనకారులు కలెక్టరేట్ ముట్టడికి యత్నించడంతోపాటు అమలాపురం పట్టణాన్ని దిగ్బంధించారు. పలు ప్రాంతాల్లో ఆందోళనకారులు-పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. రాళ్లు, కర్రలతో దాడులు జరిగాయి. ఈ దాడిలో 20 మందికిపైగా గాయపడ్డారు. మరోవైపు అల్లర్ల కారణంగా కోనసీమ జిల్లాలో పోలీసులు ఇంటర్నెట్ సేవలను నిలిపివేసి 30, 144 సెక్షన్లు అమలులోకి తీసుకొచ్చారు.