అమరావతి : ఏపీలోని విశాఖపట్నంలో సంచలనం సృష్టించిన విద్యార్థిని రీతు సాహు (Ritu Sahu) మృతి కేసులో పోలీసులు నలుగురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. హాస్టల్ నిర్వాహకుల నిర్లక్ష్యంతోనే ఆమె చనిపోయిందని పేర్కొంటూ మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రాథమికంగా విచారణ జరిపిన పోలీసులు హాస్టల్ యజమాని లక్ష్మి, వార్డెన్ సూర్యకుమారి, సిబ్బంది సూర్యకాంత్, రామేశ్వర్ను అరెస్టు (Arrest) చేసి కోర్టులో హాజరు పరిచారు. వీరికి 14 రోజుల పాటు రిమాండ్(Remand) విధిస్తున్నట్లు కోర్టు వెల్లడించింది.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి (Bengal Student) చెందిన రీతు సాహు నీట్ పరీక్షకు (NEET Exam) సిద్ధం కావడానికి విశాఖలోని ఓ ప్రముఖ విద్యా సంస్థలో చేరి హాస్టల్లో చదువుకుంటుంది. జులై 14 రాత్రి 10:30 గంటల సమయంలో హాస్టల్ భవనంపై నుంచి పడడంతో తీవ్రగాయాలపాలై చికిత్సపొందుతూ జులై 16న మృతి చెందింది. అయితే బిల్డింగ్ పైకి వెళ్ళినప్పుడు ఓ డ్రెస్, కింద పడిన సమయంలో మరొక డ్రెస్ ఒంటిపై ఉన్నట్టు సీసీ ఫుటేజీలో కనిపించడంతో బాలిక తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తూ విశాఖ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు కేసును సక్రమంగా దర్యాప్తు చేయడం లేదంటూ మృతురాలి తండ్రి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జి సైతం జోక్యం చేసుకోవడంతో పోలీసులు తమ దర్యాప్తును ముమ్మరం చేశారు. కేసుపై విశాఖ సీపీ త్రివిక్రమ వర్మ మాట్లాడుతూ విద్యార్థిని మృతి హత్య, ఆత్మహత్య అనేది ఫోరెనిక్స్ రిపోర్టు ఆధారంగా తేలుతుందని పేర్కొన్నారు.