తిరుమల : ఈనెల 24 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహించనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ( Brahmotsavam ) అంగరంగవైభవంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు ( Chairman BR Naidu ) తెలిపారు.
టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరితో కలిసి ఆదివారం సాయంత్రం శ్రీవారి ఆలయ మాడ వీధుల్లో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను వారు తనిఖీ చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా, ప్రతి భక్తుడు వాహన సేవలను తిలకించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. విద్యుత్ అలంకరణపై ప్రత్యేక దృష్టి పెట్టి ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు.
తిరుమలలో 35 ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసి వాహన సేవలను తిలకించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సీవీఎస్వో మురళీకృష్ణ, సిఈ సత్య నారాయణ, ఈఈ సుబ్రహ్మణ్యం, డిప్యూటీ ఈవోలు లోకనాథం, రాజేంద్ర కుమార్, సోమన్నారాయణ , అధికారులు పాల్గొన్నారు.