అమరావతి : విజయవాడలో వెలసిన దుర్గమ్మ ఆలయంలో దసరా నవరాత్రుల సందర్భంగా వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. ఇంద్ర కీలాద్రికి వచ్చే భవాని భక్తులు ఇబ్బందులు పడకుండా ఇప్పటి నుంచే ఏర్పాట్లను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. ఇవాళ ఉత్సవాల ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయానికి వచ్చే అన్ని మార్గాల్లో ఏర్పాట్లను సీపీ కాంతి రాణా, కలెక్టరు ఢిల్లీ రావుతో కలిసి పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ ఆలయంలో మానవ వనరుల లేకపోయినా టీటీడీకి మించిన ఏర్పాట్లను చేస్తున్నామని వివరించారు. ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్ ప్రకారం 10 లెటర్స్, బ్రేక్ దర్శనానికి ఐదుగురికి అనుమతిస్తామని తెలిపారు. ప్రోటోకాల్ ప్రకారం వీఐపీలకు దర్శనం కల్పించే ఏర్పాట్లను, బ్రేక్ దర్శనాల కోసం ప్రత్యేక పోర్టల్ ను ఏర్పాటు చేస్తామన్నారు.
లోకల్ ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్ పరిధి పెంచుతామన్నారు. భవానీ భక్తుల కోసం టీటీడీ స్థలంలో తాత్కాలిక వసతి ఏర్పాట్లు చేస్తామని ఆయన ప్రకటించారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం కొండపైకి బ్యాటరీ వెహికల్స్పై దర్శనానికి అనుమతిస్తామని మంత్రి అన్నారు.