తిరుమల : తిరుమలలో రేపు(గురువారం) జరగనున్న శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటికి టీటీడీ (TTD) ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 7.30 గంటలకు మంగళవాయిద్యాలతో ఆలయ మాడ వీధుల గుండా పూలు, పండ్లు, స్వామివారి ప్రసాదాలు తదితర పూజా సామగ్రిని శ్రీవారి ఆలయ అర్చకులు శ్రీరామకృష్ణ తీర్థానికి తీసుకెళతారని టీటీడీ అధికారులు తెలిపారు. అక్కడున్న శ్రీరామచంద్రమూర్తి, శ్రీకృష్ణుని విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పిస్తారని వివరించారు.
గోగర్భం డ్యామ్ (Gogarbham dam) పాయింట్ నుంచి పాపవినాశనం వరకు యాత్రికులను తరలించేందుకు ఏపీ ఎస్ఆర్టీసీ(APS RTC) 35 బస్సులను ఏర్పాటు చేస్తోందని వివరించారు. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే యాత్రికులను తీర్థానికి అనుమతిస్తామని అన్నారు. ఈ తీర్థానికి వెళ్లే యాత్రికులకు టీటీడీ అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో పాలు, కాఫీ, పొంగళి, ఉప్మా, సాంబారన్నం, పెరుగన్నం పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టామని వెల్లడించారు.
పురాణాల ప్రకారం తిరుమలలో 3 కోట్ల 50 లక్షల పుణ్యతీర్థాలు ఉండగా వీటిలో స్వామి పుష్కరిణీ తీర్థం, కుమారధార , తుంబురు , శ్రీరామకృష్ణ , ఆకాశగంగ , పాపవినాశన తీర్థం, పాండవ తీర్థం అత్యంత ప్రసిద్ధమైనవని తెలిపారు. ఈ తీర్థాలలో స్నానమాచరిస్తే భక్తులు ముక్తిమార్గం పొందుతారని నమ్మకమని అర్చకులు వివరించారు.
సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న రామకృష్ణ తీర్థానికి అధికబరువు, ఆస్తమా, గుండె సంబంధిత సమస్యలు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, వృద్ధుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని అటవీ మార్గంలో ఈ తీర్థానికి నడిచి వెళ్లడానికి అనుమతి లేదని వెల్లడించారు.