తిరుమల : ప్రపంచ మానవాళి సంక్షేమం కోసం కరోనా వైరస్ను అరికట్టాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల వసంత మండపంలో అరణ్యకాండ పారాయణ దీక్షను టీటీడీ చేపట్టనున్నది. ఈ నెల 25 నుంచి జులై 10వ తేదీ వరకు ఈ దీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఈ విషయాన్ని టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి మీడియాకు తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో మంగళవారం సాయంత్రం ఈ కార్యక్రమం ఏర్పాట్లపై అధికారులతో ధర్మారెడ్డి సమీక్షించారు. అనంతరం ఆయన మీడియాకు వివరాలను వెల్లడించారు.
మానవాళిని కరోనా పట్టిపీడిస్తున్న తరుణంలో షోడశదిన సుందరకాండ దీక్ష రెండు సార్లు, అఖండ సుందరకాండ పారాయణం, బాలకాండ, అయోధ్యకాండ, యుద్ధకాండ పారాయణం చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. కోట్లాది మంది భక్తులు మంత్ర ఉచ్ఛారణ చేయడం వల్ల శ్రీవారి ఆశీస్సులతో కరోనా దూరమైందన్నారు. రామాయణంలోని అరణ్యకాండలో శ్రీరాముడు రాక్షసగుణాలను నశింపచేసి ఋషులకు రక్షణ కల్పించాడని, దీన్ని మోక్ష కాండ అని కూడా అంటారని వివరించారు. ప్రతి ఇంట్లో పారాయణం చేయడం ద్వారా మంత్రపూరితమైన శ్లోకాల శబ్ద తరంగాలు అక్కడి వాతావరణాన్ని పునీతం చేస్తాయన్నారు. ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రతి ఒక్కరూ శ్లోకపారాయణం చేయాలని, అలా చేయలేని వారు విని శ్రీవారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
రామాయణంలోని మొత్తం 24 వేల శ్లోకాలను పారాయణం చేయాలని టీటీడీ సంకల్పంగా పెట్టుకున్నదని ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ కేఎస్ఎస్ అవధాని తెలిపారు. ఇప్పటివరకు బాలకాండ, సుందరకాండ, అయోధ్యకాండ పారాయణం పూర్తయిందని చెప్పారు. అరణ్యకాండలోని 75 సర్గల్లో 2,454 శ్లోకాలు ఉన్నాయన్నారు. ఈ శ్లోకపారాయణ ద్వారా రాక్షస గుణాలు తొలగిపోయి సాత్విక గుణాలు అలవడతాయని చెప్పారు. రామస్యపాదౌజగ్రాహలక్ష్మణస్యచధీమతః అనే మంత్రంలోని అక్షరక్రమం ప్రకారం ఆయా సర్గల్లోని శ్లోక పారాయణం జరుగుతుందన్నారు. అరణ్యకాండ పారాయణ దీక్షకు జూన్ 24వ తేదీ సాయంత్రం 7 గంటలకు తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో అంకురార్పణ జరుగనున్నదని వెల్లడించారు. తిరుమలలోని వసంత మండపంలో ప్రతిరోజూ ఉదయం 8.30 గంటల నుంచి 16 మంది వేద, శాస్త్ర పండితులతో పారాయణదీక్ష చేపడతారని చెప్పారు. అలాగే మరో 16 మంది పండితులు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ధర్మగిరి శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞానపీఠంలో జప, తర్పణ, హోమాదులు ప్రతి శ్లోకానికీ నిర్వహిస్తారని వివరించారు.
అధికారుల సమీక్షలో ఎస్వీబీసీ సీఈఓ సురేష్కుమార్, శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు, కృష్ణశేషాచల దీక్షితులు, గోవిందరాజ దీక్షితులుతోపాటు వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు.