AP news | జల్సాలు, గుర్రపు పందేలాకు అలవాటు పడిన ఓ వ్యక్తి బ్యాంకుకే(Bank) కన్నం వేసి కటకటాల పాలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీలోని మడకశిర(Madakashira) కెనరా బ్యాంకులో(Canara bank) సుందరేష్ ఆచారి అప్రైజర్గా విధులు నిర్వహిస్తున్నాడు. విలాసాలకు అలవాటు పడిన అతను తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నాడు. సుందరేష్ 872 గ్రాముల నకిలీ బంగారాన్ని కుదువ పెట్టి రూ.70.66 లక్షలు మోసం చేసినట్లు జులై 24న బ్యాంకు అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. బ్యాంకు అధికారులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. నిందితుడని వైబీహళ్లి క్రాస్ రోడ్డు వద్ద అదుపులోకి తీసుకున్నారు. సుందరేష్ను విచారించగా..బ్యాంకుకు వచ్చే ఖాతాదారులతో పరిచయం పెంచుకొని మాయ మాటమాటలతో వారి ఖాతాల్లో నకిలీ బంగారు రుణాల ఖాతాలు సృష్టించాడు. వచ్చిన సొమ్ముతో బెంగళూరు వెళ్లి జల్సాలకు పాల్పడే వాడు. నిందితుడి నుంచి రూ.30.20 లక్షలు స్వాధీనం చేసుకున్నామని ఈ నేరంలో ఇతరుల పాత్రపై దర్యాప్తు కొనసాగిస్తున్నామని పోలీసులు తెలిపారు.