తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజు ఆదివారం ఉదయం అమ్మవారు సర్వభూపాల వాహనంపై ఉట్టికృష్ణుడి అలంకారంలో కనువిందు చేశారు. ఆలయం వద్దగల వాహన మండపంలో అమ్మవారి వాహనసేవ ఏకాంతంగా జరిగింది. శ్రీవారి హృదయంపై నిలిచి అలమేలుమంగ దర్శనమిచ్చారు. వాహనంపై తూర్పు దిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా సేవలందించారు.
వాహనసేవలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జేఈవో వీరబ్రహ్మం, ఆలయ డిప్యూటీ ఈవో కస్తూరిబాయి, ఏఈవో ప్రభాకర్ రెడ్డి, పాంచరాత్ర ఆగమసలహాదారు శ్రీనివాసాచార్యులు, అర్చకులు బాబుస్వామి తదితరులు పాల్గొన్నారు.