విశాఖపట్నం: అచ్యుతాపురంలోని పోరస్ లేబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్లో ఉత్పత్తి నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (ఏపీపీసీబీ) ఆదేశాలు జారీ చేసింది. గ్యాస్ లీక్ నేపథ్యంలో పోరస్ సంస్థ నుంచి నమూనాలను సేకరించిన ఏపీపీసీబీ అధికారులు.. తగు పరీక్షలు జరిపేందుకు ఆ నమూనాలను హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) కి పంపారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని బ్రాండిక్స్ ఇండియా అపెరల్ సిటీకి చెందిన సీడ్స్ ఇంటిమేట్ అపెరల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో గ్యాస్ లీక్ అయిన విషయం తెలిసిందే.
సీడ్స్ ఇంటిమేట్ అపెరల్ ఇండియా నుంచి 600 మీటర్ల దూరంలో ఉన్న ఫార్మాస్యూటికల్ కంపెనీ అయిన పోరస్ లేబొరేటరీస్ నుండి గ్యాస్ లీక్ అయిందని తొలుత అందరూ భావించారు. గ్యాస్ లీక్ కార్యాలయంలోని 350 మంది మహిళా ఉద్యోగులపై ప్రభావం చూపినట్లుగా సమాచారం. అయితే, కంపెనీ యాజమాన్యం అలాంటి లీకేజీ ఏదీ జరుగలేదని ఖండించింది. తమ ప్రాంగణంలో పనిచేస్తున్న ఉద్యోగులు ఎటువంటి అసౌకర్యం గురించి ఫిర్యాదు చేయలేదని యాజమాన్యం పేర్కొన్నది.
సంఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత పోరస్ లేబొరేటరీస్కు ఉత్పత్తిని నిలిపివేయాలని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి సూచనలు చేసేంత వరకు ప్లాంట్లోని అన్ని తయారీ కార్యకలాపాలను తక్షణమే నిలిపివేయాలని యాజమాన్యాన్ని ఆదేశించింది. గ్యాస్ లీక్ సంఘటన తర్వాత ఏపీ సెజ్కు సంబంధిత ఉన్నతాధికారులు వరుస సందర్శనల అనంతరం పోరస్ ల్యాబ్కు ఈ ఆదేశాలు జారీ చేయడం విశేషం.