అమరావతి: రాష్ట్రంలో చెత్త సేకరణ సమస్య నుంచి బయటపడేందుకు జగన్ సర్కార్ వినూత్న ఆలోచన చేసింది. గ్రామాల్లో నిత్యం చెత్తను సేకరిస్తున్న తీరును ట్రాక్ చేసేందుకు ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఏపీ సిటిజెన్ యాప్ ద్వారా చెత్త సేకరణను ఇకపై ట్రాక్ చేసి గ్రామాలు పరిశుభ్రంగా చేయాలని ఏపీ పంచాయతీరాజ్ శాఖ నిర్ణయించింది.
రాష్ట్రంలోని గ్రామాల్లో క్లాప్ మిత్రలు నిత్యం చెత్తను సేకరించేలా చూడటానికి యాప్ను అందుబాటులోకి తెచ్చారు. చెత్త సేకరణను ట్రాక్ చేస్తూ ఇళ్లకు మెసేజ్లు పంపడం ద్వారా చెత్తను తీసుకెళ్లిందీ లేనిదీ తెలుసుకోగలుగుతారు. ఒకవేళ చెత్త సేకరణ జరుగకపోతే.. అధికారులు సదరు క్లాప్ మిత్రకు సమాచారం ఇచ్చి వివరణ కోరుతారు. అదే రోజు లేదా మరుసటి రోజు ఆ ఇంటి చెత్తను తొలగించేలా చర్యలు తీసుకుంటారు. స్మార్ట్ మొబైల్ ఉన్నవారు ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. గ్రామాల్లో ఇప్పటి వరకు 67,08,960 మంది ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోగా.. చాలా మంది మెసేజ్లకు బదులివ్వడంలో తాత్సారం చేస్తున్నట్లు తెలుస్తున్నది. తద్వారా తమ గ్రామంలో, తమ ఇంట్లో చెత్త సేకరణకు ఆటంకాలు ఏర్పర్చిన వారవుతారని తెలుసుకోవాలి.
ఇలా ఉండగా, 20 రోజుల క్రితమే ఈ యాప్ను అందుబాటులోకి తేగా.. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో అత్యధిక కుటుంబాలు డౌన్లోడ్ చేసుకున్నాయి. ఈ యాప్ను అన్ని గ్రామాల ప్రజలు డౌన్లోడ్ చేసుకుని సమాచారం ఇవ్వడం ద్వారా చెత్త సేకరణకు పూర్తిస్థాయిలో దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు. నిత్యం 70 లక్షల ఇండ్ల నుంచి చెత్త సేకరణ జరుగుతుండగా.. దాదాపు 50 లక్షల ఇండ్లకు మెసేజ్ పంపుతున్నారు. అయితే, చాలా మంది ఈ మెసేజ్కు బదులివ్వడం లేదు. ఫలితంగా చెత్త సేకరణ సమస్య ఎప్పటిలా మారే అవకాశాలు ఉంటాయని అధికారులు అంటున్నారు.