విశాఖపట్నం : శ్రీరామ్ ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) ఆటగాళ్ల వేలం విశాఖపట్నంలో నిర్వహించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో వేలం పాటను నిర్వహించి 120 మంది స్థానిక క్రికెటర్లకు అవకాశాలు కల్పించారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరపున వేలం కార్యక్రమాన్ని చారు శర్మ ఎటువంటి అవాంతరాలు లేకుండా నిర్వహించారు. ఆటగాళ్లకు ఇచ్చిన క్యాటగిరీ ప్రకారం బిడ్డింగ్ నిర్వహించగా.. ఫ్రాంచైజీలు పోటాపోటీగా పాల్గొన్నారు. ఫ్రాంచైజీలు ఇచ్చిన నామినేషన్ ప్రకారం ఏ, బీ, సీ క్యాటగిరీలవారీగా ఆటగాళ్ల వేలం పూర్తిచేశారు. వచ్చే నెల 6 వ తేదీ నుంచి మినీ ఐపీఎల్గా పిలుచుకునే ఏపీఎల్ ప్రారంభం కానున్నది.
ఐకాన్ ప్లేయర్లకు బేస్ ధర రూ.1.5 లక్షలు, క్యాటగిరీ ఏ కి రూ.1 లక్ష, క్యాటగిరీ బీ కింద రూ.50,000, క్యాటగిరీ సీ కింద రూ.25,000 గా నిర్ణయించారు. ఆరు ఫ్రాంచైజీలు దాదాపు 120 మంది క్రికెటర్లను ఎంపిక చేసుకున్నాయి. కాగా, నెల్లూరుకు చెందిన అశ్విన్ హెబ్బార్కు అత్యధిక ధర రూ.8.7 లక్షలుగా బిడ్డింగ్ వచ్చింది. హెబ్బార్ ఆంధ్ర రంజీ జట్టు సభ్యుడిగా ఉన్నారు. అతడ్ని వేలంలో వైజాగ్ వారియర్స్ సొంతం చేసుకున్నది. కాగా, రికీ భుయ్ రూ. 8.1 లక్షలకు బెజవాడ టైగర్స్, వెంకట శశికాంత్ రూ. 6.1 లక్షలకు గోదావరి టైటాన్స్, గిరినాథ్ రెడ్డి రాయలసీమ కింగ్స్ , కే వెంకట శశికాంత్ను గోదావరి టైటాన్స్ రూ. 6.1 లక్షలు, కే శ్రీకర్ను భారత్ రూ. 6 లక్షలకు ఉత్తరాంధ్ర లయన్స్ దక్కించుకున్నాయి.
వేలం పాటలో ఏసీఏ సీఈవో ఎం శివారెడ్డి, ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు జీవీవీ గోపాలరాజు, జగన్నాథరావు, నాగేశ్వర్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఏసీఏ కోశాధికారి, పాలక మండలి సభ్యుడు గోపీనాథ్ రెడ్డి ఫ్రాంచైజీ యజమానులకు, చారు శర్మకు కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రా ప్రీమియర్ లీగ్ ప్రారంభ ఎడిషన్ జూలై 6 నుంచి 17 వరకు కొనసాగనున్నది. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్కు 27 ఫ్రాంచైజీ ఎంట్రీలు వచ్చాయి. తొమ్మిదింటిని షార్ట్లిస్ట్ చేయగా.. ఆరు ఫ్రాంచైజీలు బిడ్ను గెలుచుకున్నాయి. ప్రతి జట్టులో 20 మంది ఆటగాళ్లు, నలుగురు సహాయక సిబ్బంది ఉంటారు. ఏపీఎల్ అధికారిక స్పాన్సర్గా శ్రీరామ్ గ్రూప్ వ్యవహరిస్తున్నది.