AP Weather | ఏపీలో పలు జిల్లాల్లో రానున్న మూడు గంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. విజయనగరం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి, కోనసీమ,గుంటూరు, పల్నాడు జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, మిగతా జిల్లాల్లో ఒకటి, రెండుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పిడుగులతో కూడిన వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. చెట్ల కింద ఉండకూడదని హెచ్చరించారు.
మరోవైపు ఆదివారం సాయంత్రం 5 గంటలకు కోనసీమ(జి) ముమ్మడివరంలో 79.7మిమీ, పల్నాడు(జి) గుట్లపల్లిలో 60మిమీ, నెల్లూరు(జి) జలదంకిలో 33.5మిమీ వర్షపాతం నమోదైంది.