అమరావతి : ఏపీ ఆర్థిక అధికారులు, ఉద్యోగులకు మధ్య జరిగిన చర్చలపై ఏపీ ఉద్యోగ, ఏపీ అమరావతి జేఏసీ ఉద్యోగ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఈ చర్చలో ఎలాంటి పురోగతి లేకపోవడంతో ఆందోళన బాటకు సిద్ధమవుతున్నాయి. గురువారం మధ్యాహ్నాం జాయింట్ కౌన్సిల్ స్టాఫ్ సమావేశం దాదాపు రెండు గంటల పాటు జరిగింది. ఈ సమావేశంలో కౌన్సిల్లో సభ్యత్వం ఉన్న తొమ్మిది ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో చర్చలు ప్రారంభం కాగా అధికారులు అందించిన నివేదికను చదవగా అందుకు ఉద్యోగ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.
ఉద్యోగ,ఉపాధ్యాయ, కార్మికులకు సంబంధించిన పెన్షన్లు పెండింగ్లో ఉండగా వాటి గురించి ప్రస్తావన తీసుకురాకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశాయి . ఫిట్ మెంట్ను 14.29శాతం నుంచే మొదలు పెడుతామని మొండికేయడాన్ని వ్యతిరేకించారు. ఉద్యోగులిచ్చిన 71 డిమాండ్లను అధికారులు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ప్రతిసారి సమావేశాలకు పిలిచి సమస్యలను పరిష్కరించ కుండా అవమాన పరుస్తుందని ఉద్యోగ సంఘాల నాయకులు బొప్పరాజు, బండి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు.
11వ పీఆర్సీని, అశుతోష్ మిశ్రా ఇచ్చిన నివేదికను యథావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అవలంభిస్తున్న ఉద్యోగ వ్యతిరేక విధానాలపై జనవరి 3న సెక్రటేరియట్ సమావేశంలో చర్చించి తదుపరి కార్యచర్యణను ప్రకటిస్తామని వారు వెల్లడించారు. ఇకపై జరిగే చర్చల్లో తామిచ్చిన డిమాండ్లపై పురోగతి ఉంటేనే చర్చలకు పిలువాలని లేని పక్షంలో సీఎం ఎదుట ఉద్యోగ సంఘాలను తీసుకెళ్లండని, సీఎం సమక్షంలోనే తమ బాధలు చెప్పుకుంటామని వారు పేర్కొన్నారు.