AP News : వైసీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొనసాగించిన విధ్వంసాన్ని భరించలేకే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ పార్టీని దారుణంగా ఓడించారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు విమర్శించారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడమే జగన్ ఏకైక సంకల్పమని ఆరోపించారు. అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై ప్రశ్నించే సత్తా లేని జగన్ కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడానికే మీడియా ముందుకు వచ్చి విమర్శలు గుప్పిస్తున్నారని మండిపడ్డారు.
ప్రశ్నించడానికి ఎంతో అవకాశం ఉన్నప్పటికీ అసెంబ్లీ సమావేశాలకు జగన్ ఎందుకు రావడం లేదని రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు. తన పార్టీ నేతలకు ఒక డైరెక్షన్ ఇవ్వడం కోసం, ఉనికిని కాపాడుకోవడం కోసమే ఆయన మాట్లాడుతున్నారని, కానీ ఆయన చేస్తున్న విమర్శల్లో ఏ ఒక్కదానికి నేటికీ ఆధారాలు చూపించలేకపోయారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని యువతకు ఉద్యోగాలు రాకూడదు, ఏ ఒక్కరూ బాగుపడకూడదనే దుర్బుద్ధితోనే జగన్ ప్రయత్నాలు సాగిస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వానికి కొండంత అండగా ఉన్నారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, దానిని ఖచ్చితంగా సాధించి తీరతామని ధీమా వ్యక్తంచేశారు.