AP News : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్పై ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. జగన్ది రాక్షస మనస్తత్వమని ధ్వజమెత్తారు. కరవు కాటకాలతో రాష్ట్రం అల్లాడిపోవాలనే ఆలోచన ఆయనకున్నదని విమర్శించారు. రైతు ద్రోహి జగన్ అని, అలాంటి వ్యక్తికి ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండే అర్హత కూడా లేదని మండిపడ్డారు. ఎల్నినో కారణంగా ఏపీలో ఎక్కడా ఒక్క చుక్క నీరు కూడా లేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తంచేశారు.
నాగార్జునసాగర్, శ్రీశైలం, జూరాల ప్రాజెక్టుల్లో నీళ్లు లేని పరిస్థితి ఉందని మంత్రి నిమ్మల అన్నారు. సీఎం చంద్రబాబు ముందుచూపుతోనే ఈరోజు రైతన్నలకు పట్టిసీమ ప్రాణం పోస్తోందని చెప్పారు. కృష్ణా డెల్టాకు, రాయలసీమకు పట్టిసీమతో భద్రత కల్పించారని తెలిపారు. పోలవరం పూర్తయ్యేలోపు పట్టిసీమ ద్వారా నీళ్లు పంపిస్తామని చెప్పారు. పట్టిసీమను వట్టిసీమ అని మాట్లాడిన జగన్ కృష్ణానది ఒడ్డుకొచ్చి ఈరోజు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
రూ.1300 కోట్లతో నిర్మించిన పట్టిసీమ నేడు రూ.50 వేల కోట్ల ఆదాయం సృష్టించిందని తెలిపారు. పట్టిసీమ కేవలం కృష్ణాడెల్టాకు మాత్రమే పరిమితం కాదని, రాయలసీమకు సైతం నీటి భద్రత కల్పించిన పథకమని వ్యాఖ్యానించారు.