AP News : విజయవాడలో జరిగిన ఘటనకు కులం రంగు పులిమి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై విమర్శలు చేయడం, హోంమంత్రి వంగలపూడి అనిత మేకప్పై అవమానకరంగా మాట్లాడటం లాంటి చర్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. మహిళల మేకప్ గురించి మాట్లాడటానికి గొడ్డలి పార్టీ వారికి సిగ్గు అనిపించడం లేదా..? అని ప్రశ్నించారు. పోలీసులపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నారని, ఇవన్నీ చూస్తూ తాము ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం కిష్టంశెట్టిపల్లెలో సంజీవని డిజిటల్ నెర్వ్ సెంటర్ను ప్రారంభించిన అనంతరం జరిగిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు.
వైసీపీ నేతలు అమరావతిపై కుట్ర చేయడానికే అక్కడికి వెళ్లారని, రాజధాని నిర్మాణాన్ని అడ్డుకునేందుకే రైతులను రెచ్చగొడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. గొడ్డలి పార్టీ నిరంతరం కుట్రలు చేస్తూనే ఉందని.. బ్లేడ్, గంజాయి బ్యాచ్లు రాబందుల్లా వేచి ఉన్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో రాజకీయాలు చేసే అర్హత ఆ పార్టీకి లేదని, దేవాలయాలపై దాడులు చేసిన వాళ్లే ఇప్పుడు గుళ్లకు వెళ్లి నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. వాళ్లవి పూర్తిగా క్రిమినల్ పాలిటిక్స్ అని, ఇలాంటి వ్యక్తులతో ఆడబిడ్డలకు, సమాజానికి రక్షణ లేదని అన్నారు. గొడ్డలిపార్టీ చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని బాగు చేయడానికి సుదీర్ఘ సమయం పడుతుందని చెప్పారు.
గొడ్డలి పార్టీ గత పాలనలో రూ.10 లక్షల కోట్ల అప్పులు, వ్యవస్థల విధ్వంసంతో రాష్ట్రం నలిగిపోయిందని, ఇప్పుడు బీజేపీ, జనసేన, టీడీపీ కూటమిగా రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా వెలిగొండ ప్రాజెక్టు పూర్తిచేసే బాధ్యత కూడా తనపైనే ఉందని హామీ ఇచ్చారు. ప్రాజెక్టు పునరావాసం కింద రైతులకు రూ.300 కోట్లు అందించామని, త్వరలోనే మరో రూ.600 కోట్లు విడుదల చేస్తామన్నారు. వెలిగొండతో రెండు దశల్లో 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. నదుల అనుసంధానమే రాష్ట్రాలకు శ్రీరామరక్ష అని, గోదావరి నుంచి కావేరి వరకు నీటిని తీసుకెళ్లి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామని అన్నారు. ఈ విషయంలో ఎవరికీ కడుపు ఉబ్బరం అవసరం లేదని వ్యాఖ్యానించారు.
తమకు రైతు ప్రయోజనాలే ముఖ్యమని చంద్రబాబు చెప్పారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాతోపాటు రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దుతామని, రామాయపట్నం పోర్టును పూర్తిచేసి పారిశ్రామిక క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని హామీఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, డీబీవీ స్వామి, గొట్టిపాటి రవికుమార్, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.