హైదరాబాద్ నివాసంలో అదుపులోకి తీసుకున్న ఏపీ సీఐడీ పోలీసులు
హైదరాబాద్, మే 14 ( నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించారనే ఆరోపణలతో నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజును ఆ రాష్ట్ర సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్లోని ఆయన నివాసంలో అరెస్ట్చేసి ఏపీకి తరలించారు. ఆయనపై 124ఏ, 153ఏ, 505 సెక్షన్ల కింద కేసులు నమోదుచేసినట్టు ఏపీ సీఐడీ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసులు.. ఎంపీ భార్య రమాదేవి పేరిట నోటీసులు ఇచ్చారు. వర్గాలు, కులాల మధ్య చిచ్చుపెట్టేలా రఘురామ కృష్ణరాజు వ్యాఖ్యలుచేశారని, ప్రభుత్వ పదవుల్లో ఉన్న వ్యక్తులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని అభియోగం మోపారు. ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, న్యూస్ చానళ్లు, వ్యక్తులతో కలిసి విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారని కేసు నమోదుచేశారు.