అమరావతి: పవన్ కల్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’ సినిమా టికెట్ల వ్యవహారంపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ఈ రోజు విడుదలైన సినిమాపై ఏపీలో పవన్కల్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు, థియేటర్ల యజమానుల ఆందోళనలపై ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని అంశాల్లో చట్ట ప్రకారం ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు. వ్యవస్థ ఒక్కరి కోసం పనిచేయదని స్పష్టం చేశారు. ఎవరైనా కొంత మంది వ్యక్తుల కోసం కాకుండా ప్రజల కోసం ఆలోచించాలని సూచించారు. సినిమా టికెట్ల విషయంలో ప్రభుత్వం కమిటీ వేసిందని. ఇంకా ఆ కమిటీ సినీ ఇండస్ట్రీపై చర్చిస్తుందని చెప్పారు. టికెట్ల ధరలు నచ్చకపోతే సినిమాను పోస్ట్ పోన్ చేసుకోవాలని సినిమా నిర్వాహకులకు సూచించారు.
భీమ్లానాయక్ సినిమా ప్రదర్శనపై ఏపీ ప్రభుత్వ తీరు ప్రభుత్వ ఉగ్రవాదాన్ని తలపిస్తుందని టీడీపీ నేత చంద్రబాబు ట్విటర్లో పేర్కొన్నారు. ‘రాష్ట్రంలో ఏ వ్యవస్థనూ సీఎం వదలడం లేదు. చివరికి వినోదం పంచే సినిమా రంగాన్ని కూడా తీవ్రంగా వేధిస్తున్నాడని’ ఆరోపించారు. భారతి సిమెంట్పై లేని నియంత్రణ భీమ్లా నాయక్ సినిమాకెందుకుని ప్రశ్నించారు. వ్యక్తులను టార్గెట్గా పెట్టుకుని వ్యవస్థలను నాశనం చేస్తున్న
ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు.
కాగా పవర్స్టార్ పవన్కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాను చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని నారా లోకేశ్ పేర్కొన్నారు. ఈరోజు సినిమా విడుదల సందర్భంగా ఏపీలో పవన్ కల్యాణ్ సినిమాకు అద్భుత స్పందన వస్తోందని అన్నారు. ఏపీలో అడ్డంకులను అధిగమించి చిత్రం విజయం సాధించాలని ఆకాంక్షించారు.