హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని ఐటీ టవర్లు, ఎయిర్పోర్టు, రైల్వేస్టేషన్లు చూసి అసూయ పడుతున్నట్టు ఏపీ మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. శుక్రవారం అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఆంధ్రప్రదేశ్లోని మంగళగిరి రైల్వేస్టేషన్ పునర్వ్యవస్థీకరణ అనంతరం ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించారు. కార్యక్రమంలో నారా లోకేశ్ మాట్లాడుతూ.. ‘60 ఏండ్లు చెమటోడ్చి హైదరాబాద్ను కలిసికట్టుగా అభివృద్ధి చేశాం. 2014లో కట్టుబట్టలతో మెడపట్టి బయటకు గెంటేశారు. ఆ అసూయతోనే కసి పెరిగింది. దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్ను నంబర్-1 రాష్ట్రంగా తీర్చిదిద్దుదాం. మూడేండ్ల తర్వాత నిరుద్యోగ యువత పక్క రాష్ట్రం వైపు చూడాల్సిన అవసరం లేదు, పక్క రాష్ట్రంలోని నిరుద్యోగులు ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే విధంగా పెట్టుబడులు తీసుకొస్తాం’ అని వ్యాఖ్యానించారు.
లోకేశ్ వ్యాఖ్యలపై నెటిజన్లు భగ్గుమంటున్నారు. ‘బషీర్బాగ్ కాల్పుల కోసం, మారోజు వీరన్న, బెల్లి లలితను చంపేందుకు, ఖమ్మంలోని 7 మండలాల విలీనం, నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించేందుకు ఎంత చెమటోడ్చారు?’ అని ఎద్దేవా చేస్తున్నారు. 12 ఏండ్లు పూర్తయినా రాజధాని నిర్మాణం చేసుకోవడంలేదు ఎందు కో..? అంటూ సెటైర్లు వేస్తున్నారు. కలిసికట్టుగా తెలంగాణను దోచుకొని, భూములన్నింటిని కబ్జా చేశారని మండిపడుతున్నారు. చంద్రబాబు 16 ఏండ్ల వయసులోనే హైదరాబాద్ వచ్చి అభివృద్ధి చేశారా? అని ఎద్దేవా చేస్తున్నారు.