హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి(50) హఠాన్మరణం చెందారు. సోమవారం ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో.. హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి లోపలకి వచ్చే లోపే గౌతమ్ రెడ్డి కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు. వారం రోజులపాటు దుబాయ్ ఎక్స్పోలో పాల్గొన్న గౌతమ్ రెడ్డి.. రెండు రోజుల క్రితమే హైదరాబాద్కు చేరుకున్నారు. ఇటీవలే కొవిడ్ బారిన పడ్డ గౌతమ్ రెడ్డి త్వరగానే కోలుకున్నారు. పోస్టు కొవిడ్ పరిణామాలే గుండెపోటుకు కారణమై ఉండొచ్చని ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు అనుమానిస్తున్నారు.
గౌతమ్ రెడ్డి మృతితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన కుటుంబ సభ్యులతో పాటు వైసీపీ నేతలు తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యారు. గౌతమ్ రెడ్డి మృతిపట్ల సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు నివాళులర్పించారు. గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. చివరిసారిగా దుబాయ్లోని ఖలీజ్ టైమ్స్కు గౌతమ్ రెడ్డి ఇంటర్వ్యూ ఇచ్చారు.
2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి గౌతమ్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. గౌతమ్ రెడ్డి స్వగ్రామం నెల్లూరు జిల్లాలోని మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లి. నెల్లూరు జిల్లాలో ఆయన పారిశ్రామికవేత్త, రాజకీయవేత్తగా ఎదిగారు. నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కుమారుడే గౌతమ్ రెడ్డి.