AP News | పొత్తుల విషయంలో టీడీపీ, జనసేన మధ్య విభేదాలు మొదలైనట్లు తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు సొంతంగా రెండు సీట్లను ప్రకటించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్.. తాను కూడా సొంతంగా రెండు సీట్లను ప్రకటించారు. ఈ విషయం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద చర్చగా మారింది. ఈ క్రమంలో టీడీపీ, జనసేన పొత్తుపై ఏపీ మంత్రి కొట్టు సత్యనారాయణ సెటైర్లు వేశారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరూ పొత్తులో ఉన్నప్పటికీ.. ఎవరి దారి వారిదే అన్నట్టు ఉన్నారని విమర్శించారు. ఇద్దరూ చివరి వరకు పొత్తులో ఉంటారనేది అనుమానమేనని ఎద్దేవా చేశారు.
పవన్ కళ్యాణ్ ముందుగా అధర్మాన్ని ఆశ్రయించారని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. టీడీపీ, జనసేన చివరిదాకా పొత్తులో ఉంటాయో లేదోనని అనుమానం వ్యక్తం చేశారు. బాబు రెండు సీట్లు ప్రకటించారు కాబట్టి.. తాను కూడా రెండు సీట్లు ప్రకటిస్తున్నా అని పవన్ చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు. ఇద్దరూ పొత్తులో ఉన్నప్పటికీ.. ఎవరి దారి వారిదే అన్నట్టుగా ఉన్నారని విమర్శించారు. విహంగ వీక్షణ అంటే ప్రజలను గాలికి వదిలేస్తారా? అని ప్రశ్నించారు. మీ కుటుంబాలకు మేలు జరిగితే.. నాకు ఓటు వేయండి అని సీఎం జగన్ పద్ధతిగా ప్రజలను అడుగుతున్నారని తెలిపారు. మరి చంద్రబాబు తాను చేసిన మోసాలు చూసి ఓటేయమని అడుగుతారా? అని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ ఏమని ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. గెలుపు ఎప్పుడూ ధర్మం పక్షానే ఉంటుందని స్పష్టం చేశారు. ఇక, టీడీపీ, జనసేన మధ్య పొత్తుల విషయంలో వచ్చిన విభేదాలపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు కూడా ట్విట్టర్(ఎక్స్) వేదికగా స్పందించారు. పొత్తు ధర్మమే కాదు.. ఏ ధర్మం తెలియని వాడే బాబు అని ఎద్దేవాచేశారు. ఈ విషయం తమ్ముడు పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలని సూచించారు.
ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల వ్యాఖ్యలపైనా మంత్రి కొట్టు సత్యనారాయణ స్పందించారు. షర్మిలకు ఇంకా రాజకీయ పరిణితి లేదని విమర్శించారు. చంద్రబాబు ఉచ్చులో షర్మిల పడిపోయారని అన్నారు. తండ్రి ఆశయాలను గాలికి వదిలేసి.. చంద్రబాబు స్క్రిప్ట్ చదువుతున్నారని ఎద్దేవా చేశారు.రాష్ట్రానికి ద్రోహం చేసిన కాంగ్రెస్తో చేతులు కలిపారని విమర్శించారు.