అమరావతి : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ బాబు చేసిన వ్యాఖ్యలపై ఆయన గురువారం స్పందించారు. తన రాజకీయం కోసం చంద్రబాబే భార్యను అల్లరి చేసుకుంటూ.. తనను క్షమాపణ చెప్పమనడమేంటని ప్రశ్నించారు. అసెంబ్లీలో గానీ, బయట గానీ తాము భువనేశ్వరి గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. తనకు సెక్యూరిటీ అవసరం లేదన్న చంద్రబాబు వెంటనే జెడ్ప్లస్ సెక్యూరిటీని వదిలేయాలని డిమాండ్ చేశారు.
నందమూరి కుటుంబ సభ్యులు అమాయకులు
‘వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి.. తన భార్యను అవమానించారని, అందుకే అసెంబ్లీకి వెళ్లడం లేదని చెప్పడం’ రాజకీయం కోసం బాబు చేస్తున్న డ్రామా అన్నారు. భువనేశ్వరి పేరుతో రాజకీయం చేస్తే నందమూరి కుటుంబం మద్దతు వస్తుందనేది ఆయన ఆలోచన అని ఆరోపించారు. ‘నందమూరి కుటుంబ సభ్యులు అంతా అమాయకులు. ఎన్టీఆర్ సీఎంగా ఉంటే పార్టీ నాశనం అవుతుందని చంద్రబాబు చెప్పినా విన్నారు. గొర్రె కసాయి వాడినే నమ్ముతుంది. చంద్రబాబు ఏది చెప్పినా నమ్ముతుంది’ అంటూ నందమూరి కుటుంబాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నందమూరి కుటుంబం అంటే సీఎం జగన్ కూడా గౌరవం ఉందన్నారు.
ఎన్టీఆర్తో సంబంధం లేదు
జూనియర్ ఎన్టీఆర్ తమను కంట్రోల్ చేయడమేంటని ప్రశ్నించారు. ఆయనతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ‘ఒకప్పుడు కలిసి ఉండొచ్చు. ఇప్పుడు విడిపోయాం. ఆయన చెబితే మేమెందుకు వింటాం? ఇప్పుడు నేను, వంశీ జగన్తో ఉన్నాం. ఆయన కోసం పని చేస్తున్నాం’ అన్నారు. ‘జగన్పై అక్రమంగా కేసులు పెట్టించిన సోనియా ఏమయ్యారో.. కేసులు పెట్టిన శంకర్రావు పరిస్థితి ఏంటో.. ఎర్రంనాయుడు ఏమయ్యాడో అంటూరు చూశారు’ అంటూ.. వరద బాధితులతో ‘సీఎం గాల్లో వచ్చాడు.. గాల్లో కలిసిపోతాడు’ అంటూ చేసిన వ్యాఖ్యలపై ఈ విధంగా స్పందించారు.