AP DSC Results | ఏపీ మెగా డీఎస్సీ ఫలితాలు విడుదలయ్యాయి. 16,347 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ కోసం ఇటీవల ప్రభుత్వం డీఎస్సీ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఫలితాలను సోమవారం సాయంత్రం విడుదల చేసినట్లు మెగా డీఎస్సీ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో విడుదల చేశారు.
అభ్యర్థులు పాఠశాల విద్యా శాఖ అధికారిక వెబ్సైట్ https://apdsc.apcfss.in/ ద్వారా తమ ఫలితాలను తెలుసుకోవచ్చని ఎంవీ కృష్ణారెడ్డి తెలిపారు. అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్లోకి వెళ్లి తుది ఫలితాలతో పాటు స్కోర్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. టెట్ వివరాలకు సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే అధికారిక వెబ్సైట్లో హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయడం ద్వారా తామే టెట్ వివరాలు సరిచేసుకునే అవకాశం ఇచ్చామని తెలిపారు. ఈ అవకాశం రెండు రోజులు మాత్రమే అంటే ఈ నెల 13వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.
ఫలితాలు ఇలా తెలుసుకోండి..
అభ్యర్థులు ముందుగా https://apdsc.apcfss.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. ఆ తర్వాత హోంపేజీలో కనిపించే మెగా డీఎస్సీ-2025 ఫలితాలు విడుదల అనే లింక్పై క్లిక్ చేయాలి. అప్పుడు క్యాండిడేట్ లాగిన్కు సంబంధించిన పాప్అప్ ఓపెన్ అవుతుంది. అందులో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వాలి. అక్కడ స్కోర్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందులో అభ్యర్థులు రాసిన మొత్తం పేపర్లు, సాధించిన మార్కులు, టెట్ మార్కులను పేర్కొంటూ క్వాలిఫైడ్/నాన్ క్వాలిఫైడ్ అనే వివరాలు ఉంటాయి.
రాష్ట్రంలోని 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఈ ఏడాది జూన్ 6 నుంచి జూలై 2వ తేదీ వరకు మెగా డీఎస్సీ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు 3,36,307 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 92.90 శాతం మంది పరీక్షలకు హాజరయ్యారు.