Mudragada | త్వరలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీకి గట్టి షాక్ తగిలింది. గత ఎన్నికల్లో అప్పటి అధికార టీడీపీకి వ్యతిరేకంగా పని చేసిన కాపు నాయకుడు ముద్ర గడ పద్మనాభం వైఖరి మార్చుకున్నారు. ఎన్నికల కోసం భారీ కసరత్తు చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన రెడ్డికి గట్టి షాక్ ఇచ్చారు. వైఎస్ జగన్ రాయబారిగా తనను కలవడానికి వస్తానని రాయబారం పంపిన వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులును కలవడానికి ఇష్ట పడలేదు. ‘మీరు మా ఇంటికి వచ్చి మీ సమయం వ్రుధా చేసుకోవద్దు.. మీ పని మీరు చేసుకోండి’ అని తోట త్రిమూర్తులుకు స్పష్టం చేసినట్లు తెలుస్తున్నది. తోట త్రిమూర్తులు వచ్చినా తాను కలవబోనని స్పష్టం చేశారు.
ఎన్నికల వేళ వైసీపీలో చేరే ప్రసక్తి లేదని ముద్రగడ పద్మనాభం తెగేసి చెప్పారు. పవన్ కల్యాణ్ సారధ్యంలోని జనసేనలోకి గానీ, చంద్రబాబు ఆధ్వర్యంలోని టీడీపీలో గానీ చేరతానని స్పష్టం చేశారు. ఆ పరిస్థితులు లేకపోతే ఇంట్లో కూర్చుంటానని చెప్పారు. 1989-94 మధ్య కాలంలో కాపులకు రిజర్వేషన్ కోసం ముద్రగడ పని చేశారు. 1994లో టీడీపీ నుంచి పోటీ చేశారు. 1999 వరకూ టీడీపీలో ఉన్న ముద్ర గడ పద్మనాభం.. 2014 ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన కాపు రిజర్వేషన్ల హామీ అమలు చేయాలని మరోమారు ఉద్యమం చేశారు. నాడు ముద్రగడ పట్ల అప్పటి అధికార టీడీపీ అమర్యాదకరంగా వ్యవహరించింది. దీంతో ఆయన పరోక్షంగా వైఎస్ జగన్ ఆధ్వర్యంలోని వైసీపీకి పరోక్ష మద్దతు పలికారు.