విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు ఏప్రిల్ నెలలో జరిపేందుకు అధికారులు అంతా సిద్ధం చేశారు. త్వరలోనే పరీక్షల షెడ్యూల్ విడుదల చేయనున్నారు. వివిధ కారణాలతో సిలబస్ను 30 శాతం తగ్గించడంతో ఆ మేరకే విద్యాబోధన కొనసాగిస్తున్నారు. పరీక్షల సిలబస్ను కూడా అదేవిధంగా తీసుకొని ప్రశ్నాపత్రాలు సిద్ధం చేస్తున్నారు.
ఏపీలో ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ఏప్రిల్లో నిర్వహించనున్నారు. పరీక్షల నిర్వహణకు ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ను ఖరారు చేయనున్నట్లు బోర్డు కార్యదర్శి ఎంవీ శేషగిరిబాబు తెలిపారు. అదే రోజు ఇంటర్మీడియట్తో పాటు ఇతర పరీక్షల షెడ్యూల్ కూడా విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రోటోకాల్ ప్రకారం అన్ని జాగ్రత్తలతో పరీక్షలు నిర్వహిస్తామని, ఇతర అవసరాల కోసం జిల్లాలకు నిధులు కేటాయిస్తూ పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లు చేసినట్లు కార్యదర్శి వివరించారు.
2021-22 విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభం కావడం, కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆఫ్లైన్ తరగతులు నిర్వహించలేకపోవడం వంటి కారణాలతో ఇంటర్మీడియట్ బోర్డు సిలబస్ను 30 శాతం తగ్గించింది. అలాగే, ఈ పరీక్షలకు ఉపయోగపడేలా కంటెంట్ను రూపొందించామని, త్వరలో విద్యార్థులకు అందుబాటులోకి తెస్తామని శేషగిరిబాబు తెలిపారు. ఈ మెటీరియల్ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు మాత్రమే కాకుండా జేఈఈ మెయిన్, అడ్వాన్స్, నీట్, ఏపీఈఏపీసెట్లకు కూడా ఉపయోగపడనున్నది.