గుంటూరు : మంగళగిరిలోని 6వ ఏపీఎస్పీ బెటాలియన్లో బుధవారం ఉదయం 20వ బ్యాచ్ కెనైన్ పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి తానేటి వనిత ముఖ్యఅతిథిగా హాజరై పరేడ్ను వీక్షించారు. శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన శిక్షణ పొందిన జాగిలాలకు హోంమంత్రి అవార్డులను అందజేశారు.
ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నదని చెప్పారు. మహిళల రక్షణ, చిన్నారుల రక్షణ, క్రైమ్ రేట్ను అదుపులో ఉంచడంలో ఏపీ పోలీసులు మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ డాగ్ స్క్వాడ్లో ప్రస్తుతం 177 జాగిలాలు ఉన్నాయని, వీటితో పాటు మరో 35 జాగిలాలను చేర్చనున్నట్లు హోం మంత్రి తెలిపారు. పోలీసు జాగిలాల ఆరోగ్య సంరక్షణ కోసం పశువైద్య నిపుణులను నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఆమె పేర్కొన్నారు. జాగిలాను వినియోగించి ఎన్నో సంక్లిష్ట కేసులను పోలీసులు ఛేదిస్తున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్కుమార్ గుప్తా, ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులుతోపాటు పలువురు ఇతర పోలీసు ఉన్నతాధికారులు, కెనైన్ ఇంఛార్జీలు పాల్గొన్నారు.