రాజమండ్రి : ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోకు సంబంధించిన ఫోరెన్సిక్ నివేదిక కోసం ఎదురుచూస్తున్నట్లు ఏపీ హోంమంత్రి తానేటి వనిత స్పష్టం చేశారు. మాధవ్కు సంబంధించిన న్యూడ్ వీడియోను ప్రస్తుతం ఫోరెన్సిక్ ల్యాబ్లో పరిశీలిస్తున్నామని, త్వరలోనే నివేదిక అందజేస్తామని తెలిపారు. వీడియో నిజమని తేలితే తగిన చర్యలు తీసుకుంటామని ఆమె వెల్లడించారు. రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఎంపీ గోరంట్ల మాధవ్ విషయంలో ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ఆరోపించారు. ఈ వీడియోపై టీడీపీ మహిళా నేతలు చాలా దారుణంగా మాట్లాడుతున్నారని, వారి వ్యాఖ్యలు, బాడీ లాంగ్వేజ్ కూడా అసభ్యకరంగా ఉన్నాయని ఆమె అన్నారు.
గత మూడేండ్లలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం రాలేదని, ప్రతిపక్ష నేతలు ఈ అంశంపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి వనిత అభిప్రాయపడ్డారు. అది మార్ఫింగ్ వీడియో అని ఎంపీ మాధవ్ ఫిర్యాదు చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. టీడీపీ హయాంలో మహిళలపై ఎన్నో దాడులు, అఘాయిత్యాలు జరిగాయని, అప్పట్లో ఎలాంటి చర్యలు తీసుకోని టీడీపీ నేతలు ఇప్పుడు నోరు తెరుస్తున్నారని మండిపడ్డారు. దిశ యాప్ ద్వారా ఇప్పటి వరకు 900 మంది మహిళలను రక్షించినట్లు చెప్పారు. ఎంపీ మాధవ్ను రక్షించేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నించడం లేదని పేర్కొన్న మంత్రి.. ఇలాంటి వీడియోలను సమాజం గానీ, ప్రభుత్వం గానీ ప్రోత్సహించబోదన్నారు. హోటళ్లు, రిసార్టుల్లో గంజాయి విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఒక ప్రశ్నకు సమాధానంగా హెచ్చరించారు.