అమరావతి : రాష్ట్రంలో కొన్ని అత్యాచారాలు అలా జరుగుతుంటాయని హోంమంత్రి మాట్లాడడం దారుణమని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. రాష్ట్రంలో మహిళలు బయటకు రావాలంటే భయాందోళనలు నెలకొని ఉన్నాయని ఆరోపించారు. ఇటువంటి సమయంలో మంత్రి వ్యాఖ్యలు సిగ్గుచేటని అన్నారు. ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్లో చలనం రావాలంటే రాష్ట్రంలో ఇంకెంతమంది ఆడబిడ్డలు బలి కావాలని అన్నారు.
దిశ చట్టం పేరుతో చేసిన మోసం ఇక చాలని పేర్కొన్నారు. విజయనగరంలో ఘోరం జరిగినా సీఎం మనస్సు కరగదా అని ప్రశ్నించారు. జిల్లాలో మహిళపై హెడ్ కానిస్టేబుల్ కొడుకు చెర్రీ స్నేహితులతో కలసి లైంగిక దాడికి పాల్పడ్డాడని తెలిపారు. జే బ్రాండ్ తాగి రెచ్చిపోయిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలను చూస్తుంటే అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా ? లేదా ?అని అనుమానం కలుగుతుందని లోకేశ్ పేర్కొన్నారు.