ఆంధప్రదేశ్ రాజధాని అమరావతిపై ఆ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఆర్డీఏ రద్దు, పాలన వికేంద్రీకరణ సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సోమవారం నుంచి చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా సారధ్యంలోని ధర్మాసనం ప్రతిరోజూ విచారిస్తున్నది. ఈ నేపథ్యంలో మంగళవారం విచారణ సమయంలో చీఫ్ జస్టిస్ మిశ్రా స్పందిస్తూ రాజధాని కోసం 30 వేల మంది రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చినప్పుడు అమరావతి కేవలం రైతుల రాజధాని మాత్రమే కాదని, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి రాజధాని అని వ్యాఖ్యానించారు.
ఏపీ రాజధాని అంటే కర్నూల్, విశాఖలతోపాటు అన్ని ప్రాంతాల ప్రజల రాజధాని అని చెప్పారు. అమరావతి రైతుల పోరాటాన్ని చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా.. స్వాతంత్య్ర పోరాటంతో పోల్చారు. స్వాతంత్య్ర సమరయోధులు స్వాతంత్య్రం కోసం అంటే వారి కోసమే కాదని, ప్రజలందరి కోసం పోరాడారన్నారు. ఆ స్వాతంత్య్రం కేవలం సమరయోధులకు సంబంధించింది మాత్రమే కాదని, దేశ ప్రజలందరిదీ అని చీఫ్ జస్టిస్ మిశ్రా పేర్కొన్నారు.