AP Capital | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఎక్కడ ఉండాలన్న అంశంపై గాక.. రాష్ట్ర ప్రభుత్వ విధాన నిర్ణయం చట్టబద్దతపైనే విచారణ జరుపుతున్నామని రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా చెప్పారు. ఏపీకి మూడు రాజధానుల అంశంపై దాఖలైన పిటిషన్లపై వరుసగా నాలుగోరోజు గురువారం హైకోర్టులో విచారణ జరిగింది.
అమరావతిలో రాజధాని ఏర్పాటుపై నాడు విపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించలేదని రైతుల తరపు న్యాయవాది ఉన్నం మురళీధర్ వాదించారు. విపక్ష నేతగా వైఎస్ జగన్ నాడు అమరావతి రాజధాని నిర్ణయాన్ని స్వాగతించారని గుర్తు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలను అవసరమైతే ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. కానీ అధికారంలోకి వచ్చాకే మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. నీరు, భూమి, భౌగోళికంగా రాష్ట్రం మధ్యలో అనుకూలంగా ఉన్నందునే అమరావతిని ఎంపిక చేశారన్నారు.
శివరామకృష్ణ కమిటీ నివేదికలో పలు సూచనలు వచ్చాయని మురళీధర్ చెప్పారు. మెజారిటీ ప్రజలు అమరావతిలోనే రాష్ట్ర రాజధాని ఏర్పాటు చేయాలని కోరారని పేర్కొన్నారు. గతంలో రాజధానిగా అమరావతి ఏర్పాటు నిర్ణయాన్ని ఎవరూ వ్యతిరేకించలేదని మరో న్యాయవాది ఆది నారాయణ రావు పేర్కొన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి గురించి వాదిస్తున్న వారు నాడెందుకు వ్యతిరేకించలేదని ప్రశ్నించారు.