అమరావతి: వైసీపీ ప్రభుత్వం తీసుకురానున్న మూడు రాజధానుల ఆంశంపై మరోసారి ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. మూడు రాజధానుల బిల్లులను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టింది. ప్రభుత్వం చట్టాలను ఉపసంహరించుకున్నా మళ్లీ ప్రవేశ పెడతామని పేర్కొనడంతో విచారణ కొనసాగించాలని పిటిషనర్ తరఫు న్యాయవాదులు హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. పిటీషన్లలో ఏ అంశాలపై విచారణ కొనసాగించాలో అఫిడవిట్లు దాఖలు చేయాలని గతంలో త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది.
సీఆర్డీఏ మాస్టర్ ప్లాన్ అభివృద్ధి, నిర్మాణం నిలిపివేసిన పనులు కొనసాగించడం, రైతుల ప్లాట్లను అభివృద్ధి చేయడం, రాజధాని నుంచి కార్యాలయాల తరలింపు తదితర అంశాలపై వాదనలు వినిపించారు. మొత్తం 70 పిటిషన్లపై వాదనలు కొనసాగాయి. కాగా, తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.
కాగా, మూడు రాజధానుల అంశంపై తాజాగా మంత్రి అవంతి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా రాష్ట్రంలో 26 జిల్లాలు ఎలా ఏర్పాటయ్యాయో .. అదేవిధంగా మూడు రాజధానులు కూడా వస్తాయన్నారు. విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ రాజధానిగా అవ్వడం ఖాయమని ధీమాగా చెప్పారు.