అమరావతి: కొత్త జిల్లాల ఏర్పాటుపై దాఖలైన పిటిషన్లపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సోమవారం విచారించింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్లు ఆర్టికల్ 371 (డీ) కి విరుద్ధంగా ఉన్నాయని విజయ్ కుమార్ (గుంటూరు), సిద్ధార్థ (శ్రీకాకుళం), రామారావు (ప్రకాశం) వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యాలను విచారించిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కొత్త జిల్లాలపై తుది ఉత్తర్వులు రావాల్సి ఉన్నందున మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. తదుపరి విచారణను 8 వారాలకు హైకోర్టు వాయిదా వేసింది.
లోక్సభ నియోజకవర్గాల ప్రాతిపదికన కొత్త జిల్లాల ఏర్పాటుపై సర్వత్రా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఏప్రిల్ నెల నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నది. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ప్రభుత్వంపై ఇటీవల కోర్టులో పిల్ దాఖలు కాగా, స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పార్లమెంట్ నియోజకవర్గాల ఆధారంగా కొత్త జిల్లాలును ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. ఆ మేరకు ప్రజల నుంచి సూచనలు, సలహాలను కోరుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఏప్రిల్ 2వ తేదీలోగా అభ్యంతరాలను పరిశీలించి జిల్లాల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది.
ఈ నేపథ్యంలో కోర్టులో దాఖలైన మూడు వేర్వేరు పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు.. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. 371 (డీ) కి విరుద్ధంగా ఉన్నాయంటూ దాఖలైన పిటిషన్లు సరైన ఆధారాలు చూపలేకపోయారని కోర్టు ఆభిప్రాయపడింది. కౌంటర్ క్లెయిమ్లు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అయితే, జిల్లాల ఏర్పాటుపై ఇప్పటికే విచారించిన ఏపీ హైకోర్టు తుది ఉత్తర్వులు వెలువరించేందుకు సిద్ధంగా ఉన్నది. కాగా, జిల్లాల ఏర్పాటు, జిల్లా కేంద్రాల కోసం దాదాపు అన్ని జిల్లాల్లో ఆందోళనలు జరుగుతున్నది తెలిసిందే.